అలాగైతే బీజేపీలో చేరుతా

అలాగైతే బీజేపీలో చేరుతా

హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌ తో కలిస్తే మాత్రం తాను బీజేపీలో చేరతానన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.  పార్టీ మార్పుపై కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తుండగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శనివారం ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఉందని, మాటకు మాట అన్నట్టుగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అన్నారు.

కొందరు కాంగ్రెస్‌ నేతలు.. కేసీఆర్‌ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనుకపడ్డామన్నారు. ఎవరికి పీసీసీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాట మీదకు వచ్చామన్నారు. కేసీఆర్‌ కు పదునైన భాషతో బదులు చెప్పే నేతలే కావాలన్నారు. కేసీఆర్‌ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.