టీజీవో ప్రెసిడెంట్​ మమత బదిలీ .. 13 ఏండ్లుగా కూకట్​పల్లిపరిధిలోనే విధులు

టీజీవో ప్రెసిడెంట్​ మమత బదిలీ .. 13 ఏండ్లుగా కూకట్​పల్లిపరిధిలోనే విధులు
  • కూకట్‌‌పల్లి జోనల్‌‌ కమిషనర్‌‌ నుంచి ఎన్ఐయూఎం డైరెక్టర్​గా ట్రాన్స్​ఫర్​
  • గతంలో ట్రాన్స్​ఫర్​చేసినా.. రద్దు చేయించుకున్న అధికారిణి

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ గెజిటెడ్‌‌ అధికారుల సంఘం(టీజీవో) అధ్యక్షురాలు, జీహెచ్‌‌ఎంసీ కూకట్‌‌పల్లి జోనల్‌‌ కమిషనర్‌‌ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్(ఎన్ఐయూఎం) డైరెక్టర్​గా నియమిస్తూ మున్సిపల్‌‌ అర్బన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రెటరీ దాన కిశోర్‌‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆమె స్థానంలో కూకట్‌‌పల్లి జోనల్‌‌ కమిషనర్‌‌గా ఐఏఎస్‌‌ అధికారి అభిలాష అభినవ్‌‌ నియామకమయ్యారు. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న స్నేహా శబరీష్ కు శేరిలింగంపల్లి జోనల్​కమిషనర్​గా పోస్టింగ్​ఇచ్చారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ అడిషినల్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీలో  సూపరింటెండెంట్ ఇంజినీర్ గా ఉన్న వెంకట రమణ మూసీ రివర్​ఫ్రంట్ ఎండీగా నియమితులయ్యారు. 

13 ఏండ్లుగా ఒకే దగ్గర మమత..

కూకుట్​పల్లి జోనల్ కమిషనర్(జడ్సీ) మమత 2010 నుంచి కూకట్ పల్లి పరిసర జోన్లలోనే  పనిచేస్తున్నారు. గతంలో అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరలింగంపల్లి లాంటి కీలక ప్రాంతాల్లో పనిచేసి, 2018 నుంచి కూకట్​పల్లి జడ్సీగా పనిచేస్తున్నారు. 2021లో కూకట్​పల్లి నుంచి మమతను ఎల్బీనగర్ జడ్సీగా ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ, 24 గంటలు గడవక ముందే.. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముగ్గురు ఎమ్మెల్యేల ఫైరవీలతో ట్రాన్స్​ఫర్​ఆర్డర్​ను రద్దు చేయించుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మమత కంటే 22 మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఈమెకు అధికంగా ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆమె బదిలీ అవుతున్నారన్న చర్చ సాగింది. ఎట్టకేలకు మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. 

ఇతర నేతలకూ బదిలీ టెన్షన్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్లను, అర్హులను పక్కన పెట్టి అప్పటి మంత్రి శ్రీనివాస్​గౌడ్​టీజీవోలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కీలక స్థానాల్లో పోస్టింగ్ ఇప్పించారు. అలాంటి వారికి ఇప్పుడు బదిలీ టెన్షన్​ పట్టుకున్నది. వివిధ శాఖల్లో ఉన్న టీజీవో నేతలు కీలక స్థానాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఆర్టీఏలో పలువురు ఉన్నారు. వారందర్నీ కొత్త ప్రభుత్వం బదిలీ చేస్తుందనే చర్చ జరుగుతున్నది.