- సీపీఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ర్యాలీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో మంచినీళ్ల కోసం కష్టాలు పడుతున్నామంటూ సీపీఐ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మున్సిపల్ ఆఫీసు ఎదుటే స్నాలు చేసి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులతో కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఖాళీ కుండలు, బకెట్లతో ర్యాలీ నిర్వహించారు. మంచినీళ్ల కోసం గోస పడ్తున్నా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, చైర్ పర్సన్ కె. సీతాలక్ష్మి, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
ఎండాకాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చాలాసార్లు కౌన్సిల్ మీటింగ్ లో ఎమ్మెల్యే, చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ను కోరినా ఫలితం లేదని మున్సిపల్సీపీఐ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్రెడ్డి అన్నారు. వారం, పదిరోజులకోసారి నీళ్ల సరఫరా జరుగుతోందన్నారు. నిరసన చేస్తున్నవారితో డీఈ నవీన్ కుమార్ మాట్లాడి.. నీటి సప్లై మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ప్రోగ్రాంలొ సీపీఐ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, నెరెళ్ల సమైక్య. బోయిన విజయ్ కుమార్, మునిగడప పద్మ, మాచర్లరాజకుమారి, నాయకులు పిడుగు శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.