
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే ఆ మరుసటి రోజే తాను జైలు నుంచి బయటకు వచ్చేస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. మధ్యంతర బెయిల్ గడువు జూన్ 1 తో ముగుస్తుందని, జూన్ 2న తాను మళ్లీ తీహార్ జైలుకు వెళ్లాలని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను జైలులో టీవీ ద్వారా తెలుసుకుంటానని కేజ్రీవాల్ వివరించారు. ఈమేరకు సోమవారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కౌన్సిలర్ల మీటింగ్ లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తనను తీహార్ జైలుకు పంపించిన విషయం గుర్తుచేస్తూ.. జైలులో తనను కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
తనను ఉంచిన సెల్ లో రెండు సీసీటీవీ కెమెరాలు అమర్చారని, వాటి ద్వారా మొత్తం 13 మంది ఆఫీసర్లు 24 గంటలూ తనను గమనించేవారని తెలిపారు. ఈ ఫుటేజీని ప్రధాని నరేంద్ర మోదీ కూడా చూస్తూనే ఉన్నారని విశ్వసనీయంగా తెలిసిందన్నారు. ప్రధానికి తనపై ఎందుకంత కక్ష అనేది అర్థంకావడంలేదని కేజ్రీవాల్ అన్నారు. నిత్యం ప్రజా సేవ చేస్తూ, ప్రజల మనసుల్లో తాను స్థానం సంపాదించుకోవడాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతుండవచ్చని విమర్శించారు. ప్రజల అభిమానం చూరగొన్న ఆప్ నేతలను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణల కింద కేజ్రీవాల్ అరెస్టైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు, ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీని వీడకుండా ఉన్నారంటూ తన ఎమ్మెల్యేలను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మరింత ఐకమత్యంగా, మరింత
బలంగా తయారైందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కేజ్రీవాల్పై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
జైలుపాలైన అర్వింద్ కేజ్రీవాల్కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, ఆయనను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. ఈ విషయంలో నిర్ణయాధికారం ఢిల్లీ ఎల్జీ చేతుల్లోనే ఉందని చెప్పింది. ఆ వ్యవహా రంలో జోక్యం చేసుకోవడానికి పిటిషనర్కు న్యాయపరంగా ఎలాంటి హక్కులేదని స్పష్టంచేసింది. ఈమేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ తోసిపుచ్చింది.