హైదరాబాద్ లో ప్రతి రోజు 9 గంటల 30 నిమిషాల లోపు ప్రధాన రహదారులన్నీ క్లీన్ చెయ్యాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎక్కడా క్లీనింగ్ పనులు కనిపించకూడదని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రహదారుల శుభ్రతపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్య నిర్వహణలో ఏవైనా లోపాలు జరిగితే.. ఆ పూర్తి బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, డీఈఈ లదేనని కమిషనర్ తేల్చి చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీన్ వేస్ట్ తొలగింపు బాధ్యతను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగానికి అప్పగించారు. నిర్మాణ వ్యర్థాలు , పాత చెత్తను తొలగించడానికి అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు , ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేలా చూడాలని కమిషనర్ సూచించారు.
►ALSO READ | కస్టమర్ లా వచ్చి.. షాపింగ్ మాల్స్ లో ఉంగరాలు మాయం చేస్తున్న కేటుగాడు
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్లు, డీసీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడమే తమ ప్రాధాన్యతని కమిషనర్ కర్ణన్ స్పష్టం చేశారు.
