జనంలోకి వెళ్తే కరోనా వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న భయంతో తన కూతురి కోసం ఏకంగా 180 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న విమానాన్ని బుక్ చేశాడో తండ్రి. కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా భోపాల్ లో చిక్కుకుపోయిన తన కుమార్తె, ఆమె ఇద్దరు బిడ్డలు, ఒక పనిమనిషిని ఢిల్లీ పంపడం కోసం దాదాపు రూ.20 లక్షలు ఖర్చు పెట్టాడు. సోమవారం నుంచే విమానాలు తిరుగుతున్నా సరే.. జనం మధ్యలో ప్రయాణం చేస్తే కరోనా సోకే ముప్పు ఉందన్న భయంతో ఒక ప్రైవేటు విమానాన్ని హయర్ చేసుకున్నాడు. తన ఇంటికి వచ్చిన కుమార్తెను సేఫ్ గా పంపడం కోసం ఇలా మొత్తం ఫ్లైట్ నే బుక్ చేసుకున్న ఆ అపర కుబేరుడు భోపాల్ కు చెందిన ఓ లిక్కర్ బ్యారన్ అని పలు జాతీయ సంస్థలు ప్రచురించాయి.
భోపాల్ కు చెందిన మద్యం వ్యాపారి కుమార్తె, ఇద్దరు మనవరాళ్లు లాక్ డౌన్ కు ముందు ఢిల్లీ నుంచి భోపాల్ వచ్చి చిక్కుకుపోయారు. అయితే ట్రైన్లు, ఫ్లైట్లు స్టార్ట్ అయినప్పటికీ పది మంది మధ్యలోకి వెళ్లి క్యూలు పాటిస్తూ అందరి మధ్య కూర్చుని ప్రయాణిస్తే కరోనా వైరస్ బారినపడే ప్రమాదం ఉందని ఆ లిక్కర్ బ్యారన్ ఏకంగా ఎయిర్ బస్ A320ని బుక్ చేశాడు. 180 మంది కూర్చునిప్రయాణించగలిగే ఆ విమానం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సోమవారం నాడు భోపాల్ చేరుకుంది. అక్కడి నుంచి ఆ వ్యాపారి కుమార్తె, మనవరాళ్లు, ఒక పని మనిషి… మొత్తం నలుగురితోనే తిరుగు ప్రయాణమైంది. అయితే వారికి సంబంధించి వివరాలు చెప్పేందుకు ఎయిర్ పోర్టు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఎయిర్ బస్ A320 విమానాన్ని ప్రత్యేకంగా హయర్ చేసుకోవడానికి సుమారు రూ.20 లక్షలు అవుతుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు.