- టెండర్ ధర కన్నా 4.5 శాతం ఎక్కువకు కోట్ చేసిన సంస్థ
- సంగమేశ్వరపై 4.65%, బసవేశ్వరపై 4.6% ఎక్కువకు బిడ్
- దాని వల్ల ప్రభుత్వంపై రూ.170 కోట్ల ‘అదనపు’ భారం
- సింగూరు ప్రాజెక్టు మీద రెండు ఎత్తిపోతలు
హైదరాబాద్, వెలుగు: సింగూరు ప్రాజెక్టు మీద చేపట్టనున్న ‘సంగమేశ్వర’, ‘బసవేశ్వర’ ఎత్తిపోతల పథకాల కాంట్రాక్టు పనులు మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ (ఎంఈఐఎల్)కే దక్కాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3.84 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఈ రెండు లిఫ్ట్ స్కీంలు చేపడుతున్నారు. గత నెలలో ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచారు. సంగమేశ్వర ప్రైస్ బిడ్ను శుక్రవారం, బసవేశ్వర ప్రైస్బిడ్ను శనివారం జలసౌధలో ఓపెన్ చేశారు. టెండర్ ప్రైస్తో పోలిస్తే నాలుగున్నర శాతం కన్నా ఎక్కువకు కోట్ చేసిన మేఘా సంస్థే ఈ ప్రాజెక్టుల పనులను సొంతం చేసుకుంది. సంగమేశ్వర ఎత్తిపోతలకు రూ.2,249 కోట్లతో టెండర్లు పిలువగా మేఘా 4.65 శాతం ఎక్కువ కోట్ చేసింది. నవయుగ 4.90 శాతం ఎక్సెస్కు బిడ్ వేసింది. బసవేశ్వర లిఫ్ట్ స్కీంకు రూ.1,422 కోట్లతో టెండర్లు పిలువగా మేఘా 4.60 శాతం ఎక్సెస్కు, ఎన్సీసీ 4.80 శాతం ఎక్కువకు కోట్ చేశాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఎల్1గా నిలిచిన మేఘాకే కాంట్రాక్టులు ఇచ్చారు. నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా బసవేశ్వర ఎత్తిపోతలను కట్టనున్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అంచనాలతో సంగమేశ్వర లిఫ్ట్ను నిర్మించనున్నారు.
రూటు మార్చిన్రు
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు స్కీముల్లో నాలుగున్నర శాతానికి పైగా ఎక్కువకు టెండర్లు ఖరారు చేయడంతో ప్రభుత్వంపై అదనంగా రూ.170 కోట్ల భారం పడనుంది. సంగమేశ్వర లిఫ్ట్కు రూ.104 కోట్లు, బసవేశ్వరకు రూ.64 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలప్పుడు ప్రారంభించిన నెల్లికల్ సహా అనేక ఎత్తిపోతల పథకాల టెండర్లూ నాలుగు శాతానికిపైగా అధిక ధరకే కట్టబెట్టారు. గతంలో ఒకటి, రెండు శాతం ఎక్సెస్కు మాత్రమే కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు.. సెక్రటేరియట్ టెండర్లతో రూటు మార్చాయి. అప్పటి నుంచి ప్రాజెక్టులు, ఇతర కీలక నిర్మాణ పనులన్నింటికీ నాలుగున్నర శాతంపైగానే సంస్థలు టెండర్ కోట్ చేస్తున్నాయి. దాని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.