- జూన్ 15 దాటినా దడపుట్టిస్తున్న ఎండలు, వడగాడ్పులు
- మరో మూడు రోజులు 13 జిల్లాల్లో హీట్ వేవ్స్
- రుతుపవనాల ఎంట్రీకి బిపర్జాయ్ తుఫాన్ బ్రేకులు
హైదరాబాద్, వెలుగు: మే నెలంతా ఎండలతో సతమతమయ్యే జనానికి జూన్ రాంగనే కొంత ఊపిరి పీల్చుకున్నట్లనిపిస్తది. రుతుపవనాలు ఎంటరయ్యి, ఎండ మంట తగ్గి తొలకరి పలకరిస్తది!! కానీ, ఈ సారి వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఈ ఏడాది మే నెలంతా టెంపరేచర్లు సాధారణం కన్నా ఎక్కువే నమోదయ్యాయి. దానికి తోడు చెడగొట్టు వానలు, వడగండ్లు పడి పంటలను నేలపాలు చేసి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. మేలో ఎండలు ఎట్ల మండినయో ఇప్పుడు జూన్ 15 తారీఖు దాటినా అట్లనే మండిపోతున్నాయి. వాస్తవానికి టెంపరేచర్లు జూన్ మొదటి వారం నుంచి తగ్గాలి. కానీ, వడగాడ్పులు దడపుట్టిస్తున్నాయి. ప్రధానంగా ఏడెనిమిది జిల్లాల్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. జూన్ తొలి వారం పూర్తయ్యేనాటికి రావాల్సిన నైరుతి రుతుపవనాల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. బిపర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్తో రుతుపవనాల రాకకు ఆటంకాలు కలుగుతున్నాయని, దాదాపు ఈ నెలంతా ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
తప్పిన అంచనాలు
నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ఈ నెల పది నాటికే ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత ఆ అంచనాలను సవరించి 15 నుంచి 20వ తేదీల మధ్య ఎంటరయ్యే చాన్స్ ఉందని పేర్కొంది. అయితే, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటరయ్యేందుకు ఇప్పటికీ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంటున్నారు.
పశ్చిమం నుంచి వీచే గాలుల్లో స్తబ్ధత నెలకొందని, బిపర్జాయ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ ఆలస్యమవుతున్నదని చెప్తున్నారు. గాలిలోని తేమను మొత్తం తుఫాన్ లాగేసుకున్నదని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. అయితే.. జూన్ 18 నుంచి 21 నాటికి రుతుపవనాల రాకకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మరో వారం పదిరోజులు గుజరాత్, దాని సమీప రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ టెంపరేచర్లు, హీట్వేవ్స్ పెరిగే ఆస్కారముందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం గుజరాత్, దాని సమీప రాష్ట్రాల్లో బిపర్ జాయ్ తుఫాన్ కొనసాగుతున్నది.
టెంపరేచర్లు ఇట్లనే ఉంటయ్
రాష్ట్రంలో మరో వారం పది రోజులదాకా ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్లో నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. గురువారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. రాబోయే మూడు రోజులు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. మొత్తంగా 13 జిల్లాలను హీట్వేవ్స్ అలర్ట్లో ఉంచారు.
కేరళకూ లేటుగానే వచ్చినయ్
ఈసారి రుతుపవనాలు కేరళనూ లేటుగానే తాకాయి. ఈ నెల 1నాటికే నైరుతి రుతుపవనాలు అక్కడికి వస్తాయని భావించినా.. వారం రోజులు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్న టైంలోనే అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాన్ ఏర్పడి.. ఆ ఆశలకు గండికొట్టింది. జూన్8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. రెండు రోజుల కిందటే ఆ రాష్ట్రమంతటా విస్తరించాయి. ప్రస్తుతం తుఫాను ఎఫెక్ట్తో రుతుపవనాల్లో స్తబ్ధత ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.
ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్
ఈ ఏడాది మన దేశంపై ఎల్నినో ఎఫెక్ట్ ఉండొచ్చని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. పసిఫిక్ సముద్రంలో టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ఈ క్రమంలో ఎల్నినో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతమే నమోదవుతుందని మన వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
జూన్లోనే రికార్డ్ టెంపరేచర్లు
రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈ జూన్లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదయ్యాయి. నెల మొదలైన దగ్గర్నుంచి 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటలో ఈ నెల 9న అత్యధికంగా 48.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే రోజు 7 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి. 1952లో భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ నెల 9న కాజీపేటలో నమోదైనవే హయ్యెస్ట్. ఈ నెలలో ఇప్పటిదాకా 13 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. గురువారం కరీంనగర్ జిల్లా తణుగులలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ఓదెలలో 44.9, సూర్యాపేట జిల్లా ఆలంగపురం, ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 44.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్, నేరెళ్ల, ఖమ్మం జిల్లా పమ్మిల్లలో 44.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.