
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇవాళ( శనివారం) హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆస్పత్రుల్లో 21 సీటీ స్కాన్ కేంద్రాలను మంజూరు చేశామన్నారు. అందులో మొదటి సీటీ స్కాన్ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సీటీ స్కాన్, గాంధీ ఆస్పత్రిలో ముఖ్యంగా గుండె జబ్బుకు సంబంధించిన క్యాథ్ ల్యాబ్ కూడా అవసరముందన్నారు. కొత్త క్యాథ్ ల్యాబ్ను రూ. 6.5 కోట్లతో.. MRI మిషన్ను రూ. 12.5 కోట్లతో మంజూరు చేశామన్నారు. గాంధీలో ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ను వచ్చే 45 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి హరీశ్ రావు.
గాంధీ ఆస్పత్రిలో కరోనా సేవలు అద్భుతంగా అందించారని అన్నారు హరీశ్. 84,187 మంది కొవిడ్ బాధితులకు వైద్యం అందించారన్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు చేతులెత్తేస్తే.. గాంధీకి వస్తే పునర్జన్మ కల్పించారని తెలిపారు. ఈ ఘనత గాంధీ ఆస్పత్రి సిబ్బందికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాంధీ ఆస్పత్రికి రూ. 176 కోట్ల మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ. 100 కోట్ల పనులు పూర్తయ్యాయని.. మిగిలిన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తామని హరీశ్రావు ప్రకటించారు. గాంధీలో అత్యాధునికమైన పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గాంధీ ఆవరణలో 200 పడకల MCH ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాలుగైదు నెలల్లోనే పూర్తి చేస్తామని హరీశ్రావు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ రెడీగా ఉందన్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించి, రోగులుకు హార్ట్ సర్జరీలు చేస్తామని తెలిపారు.