మిర్యాలగూడ, వెలుగు : పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ అడ్డాగా మారింది. రేషన్ డీలర్లు, దళారులు కుమ్మక్కై ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొని మిల్లుల్లో డస్ట్ క్లీన్, పాలీష్ చేసి సన్నబియ్యంతో కలిసి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన అక్రమ దందాను ఇప్పుడు కొందరు వ్యక్తులు తమ పలుకుబడితో బహిరంగంగానే కొనసాగిస్తున్నారు. ఇందులో పట్టణానికి చెందిన ఓ నలుగురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు గత ఆరు నెలల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి రాత్రికి రాత్రే తమకు అనుకూలమైన మిల్లులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
నెలకు రూ. 5.16 కోట్ల దందా
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి సహా త్రిపురారం మండలం మిర్యాలగూడ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో మొత్తం 200 రేషన్ షాపులు, 1.01 లక్షల రేషన్ కార్డులు, 2.93 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా సుమారు 29,343 క్వింటాళ్ల బియ్యం అవసరం అవుతాయి. ఈ మొత్తంలో 20 శాతం బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులు వివిధ రూపాల్లో వినియోగించుకున్నారు. మిగతా 80 శాతం అంటే 23,475 క్వింటాళ్ల బియ్యం య్యం పక్కదారి పడుతున్నట్లు సమచారం. డీలర్లు, పబ్లిక్ నుంచి కేజీ రూ. 8 చొప్పున కొనుగోలు చేసి రూ. 12కు హోల్ సేల్ డీలర్లకు అమ్ముతున్నారు. వారు మిల్లర్లు, ఏపీలోని కొందరు వ్యాపారులకు కిలో బియ్యం రూ. 14 నుంచి రూ. 18 వరకు అమ్ముతున్నారు. వారు బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నేరేడుచర్ల, నల్గొండ, త్రిపురారం పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న బిన్నీ, ఇతర రైస్ మిల్లులకు తరలించి క్లీనింగ్, పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.22 చొప్పున అమ్ముతున్నారు. ఇలా నెలకు ఒక్క మిర్యాలగూడ కేంద్రంగానే రూ. 5.16 కోట్ల అక్రమ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 22న సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురంలో గల సోమేశ్వర బిన్నీ మోడ్రన్ రైస్ మిల్లుపై పోలీసులు, సివిల్ సప్లై ఆఫీసర్లు దాడులు చేసి రూ. 2 లక్షల విలువైన 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.
ప్రజలకు పంచడమే ఆలస్యం...
మిర్యాలగూడ కేంద్రంగా జరిగే పీడీఎస్ బియ్యం దందాకు పట్టణానికి చెందిన ఇద్దరితో పాటు మండల పరిధిలోని మరో ఇద్దరే ప్రధాన సూత్రధారులు అన్న ప్రచారం జరుగుతోంది. గ్రామాలు, తండాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయగానే మిర్యాలగూడకు చెందిన ఇద్దరు తమ వ్యక్తులను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. వారి ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో బియ్యాన్ని కొని ఉమ్మడి జిల్లాలోని రైస్ మిల్లర్లతో పాటు ఏపీ, ఇతర ప్రాంత దళారులతో బేరం మాట్లాడుకుని రాత్రికి రాత్రే నియోజకవర్గ సరిహద్దులు దాటిస్తున్నారని పలువురు అంటున్నారు. గతంలో పలు కేసులతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు అయింది. అయినా ఒక్కో లోడు అమ్మితే రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు మిగులుతుండడంతో దందాను తిరిగి కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే మండల పరిధిలోని మరో ఇద్దరు వ్యక్తలు రిజక్టెడ్ పీడీఎస్ రైస్ పేరిట పర్మిషన్ తీసుకొని బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఏపీలోని దాచేపల్లి ప్రాంతానికి చెందిన వ్యాపారులతో కుమ్మక్కై దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
పీడీఎస్ బియ్యం తరలింపుపై నిఘా పెట్టాం
మిర్యాలగూడ ఏరియా నుంచి పీడీఎస్ బియ్యం తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. బియ్యం కొనొద్దని డీలర్లను ఆదేశించాం. పీడీఎస్ బియ్యం తరలింపుపై నిఘా పెట్టాం. ఎవరైనా అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రామకృష్ణారెడ్డి, సివిల్ సప్లై డీటీ, మిర్యాలగూడ