మిస్ ఇండియాగా సుమన్ రావ్

మిస్ ఇండియాగా సుమన్ రావ్

ఫెమీనా మిస్​ ఇండియా 2019 కిరీటం రాజస్థాన్​ అమ్మాయి సుమన్​ రావ్​ సొంతమైంది. గత ఏడాది మిస్​ ఇండియా అయిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వ్యాస్​ ఆమెకు కిరీటం పెట్టారు. ఇక, ఫస్ట్​ రన్నరప్​గా ఛత్తీస్​గఢ్​కు చెందిన శివానీ జాధవ్​ నిలిచారు. ఆమెనే మిస్​ గ్రాండ్​ ఇండియా 2019 కిరీటాన్ని అందుకున్నారు. బీహార్​కు చెందిన శ్రేయా శంకర్​ మిస్​ ఇండియా యునైటెడ్​ కాంటినెంట్స్​ 2019గా నిలిచారు. తెలంగాణ అమ్మాయి సంజనా విజ్​ రన్నరప్​ స్థానాన్ని దక్కించుకున్నారు. ముంబైలోని ఎన్​ఎస్​సీఐ ఎస్​వీపీ స్టేడియంలో శనివారం రాత్రి ఫైనల్​ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కత్రినా కైఫ్​, దియా మీర్జా, కరణ్​ జోహార్​, మిస్​ వరల్డ్​  2017 మానుషి చిల్లర్​ వంటి తారలు  హాజరయ్యారు. రాజస్థాన్​లోని రాజ్​సమంద్​కు చెందిన సుమన్​ రావ్​ 1999 నవంబర్​ 23న జన్మించారు. రాజస్థాన్​లో పుట్టినా పెరిగిందంతా ముంబైలోనే. తర్వాత ఢిల్లీలో బీకాం చదివారు. ప్రస్తుతం చార్టర్డ్​ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్నారు. ఆమె మంచి కథక్​ డాన్సర్​ కూడా. పోటీల్లో భాగంగా జెండర్​ అసమానత్వంపై ఆమె మాట్లాడారు. ‘‘నేను లింగ అసమానత్వం ఉన్న కమ్యూనిటీ నుంచే వచ్చాను. ఇప్పటికీ కమ్యూనిటీలో అది అలాగే ఉంది. నా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆ రూల్స్​ ఫాలో కావడం, లేదా వాటిని మార్చడం. నేను మార్చడానికే నిర్ణయించుకున్నా” అని చెప్పారు. సుమన్​ రావ్​ 56వ మిస్​ ఇండియా వరల్డ్​. థాయ్​లాండ్​లో జరిగే మిస్​ వరల్డ్​ పోటీల్లో ఇండియా తరఫున ఆమె పోటీ చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్​లో ఆ దేశ రాజధాని బ్యాంకాక్​లోని పట్టాయాలో పోటీలు జరుగుతాయి. రన్నరప్​ సంజనా విజ్​కు ఏపీజే అబ్దుల్​ కలాం అంటే అభిమానం. సొంతూరు ఢిల్లీ అయినా తెలంగాణలో స్థిరపడ్డారు. డాన్స్​, యాక్టింగ్​, బాస్కెట్​బాల్​, షూటింగ్​ అంటే ఇష్టం. సీఆర్​పీఎఫ్​ పబ్లిక్​ స్కూల్లో ఆమె స్కూలింగ్​ చేశారు. అమిటీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోటెక్నాలజీలో డిగ్రీ చదివారు. 30 రాష్ట్రాల నుంచి (కేంద్ర పాలిత ప్రాంతాలు సహా) 30 మంది కంటెస్టెంట్లు గ్రాండ్​ ఫినాలేలో కిరీటం కోసం పోటీ పడ్డారు. వాళ్లందరికీ 40 రోజుల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చారు. మిస్​ ఇండియా పోటీల కోసం అన్ని రాష్ట్రాల్లో ఫెమీనా బ్యూటీ కాంటెస్ట్​లు పెడుతుంది. అందులో నెగ్గిన వారిని మిస్​ ఇండియా పోటీలకు ఎంపిక చేస్తుంది. ప్రముఖ డిజైనర్​ దంపతులు ఫాల్గుణి, షేన్​ పీకాక్​, మిస్​ వరల్డ్​ 2018 వానెస్సా పోన్సా డి లియోన్​ (మెక్సికో), బాలీవుడ్​ హీరోయిన్లు హ్యూమా ఖురేషి, చిత్రాంగద సింగ్​, నటుడు, డ్యాన్సర్​ రెమో డిసౌజా, అథ్లెట్​ ద్యుతీ చంద్​, ఫుట్​బాల్​ ప్లేయర్​ సునిల్​ ఛెత్రి, బాలీవుడ్​ యాక్టర్​ ఆయుష్​ శర్మలు జడ్జిలుగా వ్యవహరించారు.