- రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నందిపేట, వెలుగు: లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులపై దాడి చేసి అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మండల కేంద్రంలో ఆ పార్టీ లీడర్లు నిరసన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు నాగ సురేశ్ మాట్లాడుతూ లిక్కర్కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండడంతో ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. కానీ ధర్నా నిర్వహించిన నాయకులపై కక్షపూరితంగా టీఆర్ఎస్గుండాలతో దాడి చేయించి పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దమ్మాయి సుధాకర్, కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రవీణ్, గొదూరి నరేందర్, తారక్, సాయినాథ్, భోజారెడ్డి పాల్గొన్నారు.
రాజీనామా చేయాలి..
ఆర్మూర్/ధర్పల్లి, వెలుగు: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితతో పాటు సీఎం కేసీఆర్ప్రమేయం ఉందన్న విషయంలో ఇద్దరూ పదవులకు రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్కుమార్, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళీధర్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ కలిగోట ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ధర్పల్లిలో నిర్వహించిన నిరసనలో గంగారెడ్డి, పెద్ద బాల్రెడ్డి, మహిపాల్ యాదవ్, నవీన్ పాల్గొన్నారు.
ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం
పిట్లం, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందజేసింది. మంగళవారం పిట్లం మండలం చిల్లర్గిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్షిండే, కలెక్టర్ జితేష్ వి పాటిల్ బాధితులకు ఇందుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. మే 8న జరిగిన ప్రమాదంలో 10 మంది చనిపోగా అందులో చిల్లర్గి గ్రామానికి చెందిన ఏడుగురు, పెద్దకొడప్గల్ మండలం కాటేపల్లి, తుబ్దాల్కు చెందిన ఇద్దరు, బాన్సువాడకు చెందిన ఒకరు ఉన్నారు. ప్రమాదంపై ప్రధాని మోది స్పందించి మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ప్రకటించింది. ఈ మేరకు చిల్లర్గి స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో పది మందితో పాటు గాయపడిన 13 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని బాధితులు కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్రెడ్డి, పెద్దకొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పిట్లం వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, చిల్లర్గి సర్పంచ్ రమేశ్, ఆర్ఐ రవీంద్రనాథ్, నాయకులు విజయ్, బాబుసింగ్, సాయిరెడ్డి, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
సేంద్రియ సాగును ప్రోత్సహించాలని కలెక్టర్జితేష్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం బిచ్కుంద వచ్చిన కలెక్టర్ స్థానిక ఆఫీసర్లతో మాట్లాడారు. ముందుగా వజ్రోత్సవాలను విజయవంతం చేసినందుకు ఆఫీసర్లను అభినందించారు. జెండాను తొలగింపులో 80 శాతం మందికి అవగాహన లేదని, జెండాను ఎలా భద్రపరచలో గ్రామాల వారీగా అవగాహన కలిగించాలన్నారు. రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. హరితహారం వంద శాతం పూర్తి అయిందని.. అయినా మొక్కలు లేని చోట నాటాలన్నారు. కార్యక్రమంలో మండల ఆఫీసర్లు పాల్గొన్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం ఐలాపూర్కు చెందిన పైడాకుల కల్పన (26) అనే వివాహిత కుటుంబ కలహాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కల్పనకు ఐలాపూర్ గ్రామానికి చెందిన పైడాకుల స్వామితో పదేళ్ల కింద పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగడంతో గతంలో కుల పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ధి చెప్పారు. ఈనెల 21న మళ్లీ గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కల్పన గ్రామంలోని ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతిరాలి తండ్రి బానాల లింభయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
భిక్కనూరు, వెలుగు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ అవరణలో రూ.34 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రామేశ్వరపల్లిలో రూ.69.50 లక్షల చేపట్టినున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో విప్ మాట్లాడుతూ గ్రామలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం బాబుజగ్గీవన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి.. విగ్రహా ఏర్పాటుకు ముందుకు వచ్చిన యువతను అభినందించారు. సర్పంచ్ వేణు, ఎంపీపీ గాల్రెడ్డి, జడ్పీటీసీ పద్మనాగభూణంగౌడ్, మార్కెట్ చైర్మన్ శేఖర్, వైస్ చైర్మన్ హన్మంతరెడ్డి పాల్గొన్నారు.
కొత్త కలెక్టరేట్ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన కొత్త ఇంటిగ్రెటెడ్ కలెక్టరేట్ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ బిల్డింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రతి గది వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచే ఆయా శాఖల పనులన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని వసతులను కల్పించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నిజామాబాద్ ఆర్డీవో రవి, కలెక్టరేట్ ఏఓ
ప్రశాంత్ ఉన్నారు.
తెలంగాణ పథకాలు దేశంలో ఎక్కడా లేవు
వర్ని, వెలుగు: తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా మోస్రా, గోవూరు గ్రామాల్లో మంగళవారం స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోస్రాలోని రెడ్డి సంఘం భవనానికి భూమి పూజ, గోవూర్ నుంచి మోస్రా ఎల్లమ్మ గుడి వరకు ఫోర్ లేన్ రోడ్డుకు శంకుస్థాపన, డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాకే గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా రైతులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దైర్యం చేసి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా,మోస్రా సర్పంచ్ సుమలత రామ్ రెడ్డి, చింతకుంట సర్పంచ్ విమల లింగయ్య, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, బోధన్ ఏసీపీ రామారావు, డిప్యూటీ తహసీల్దార్ సాయిలు, ఎంపీటీసీ మమత, ఆర్ఐ మహేశ్ పాల్గొన్నారు.
ఎమ్మె ల్సీ కవితను అరెస్ట్ చేయాలి
నిజామాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఆఫీస్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని, మోడీని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కల్వకుంట్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే నిర్బంధిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ, నాయకులు డాక్టర్ మల్లికార్జున్రెడ్డి, వి.మోహన్రెడ్డి, స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.
క్యాచ్ అప్గ్రాంట్కు యూజీసీ అప్రూవల్
డిచ్పల్లి, వెలుగు: టీయూ వీసీ రవీందర్గుప్తా మంగళవారం ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆఫీసర్లను కలిసేందుకు వెళ్లారు. గత పర్యటనలో వర్సిటీకి అవసరమైన పలు పనుల గురించి పెట్టుకున్న అప్లికేషన్లకు అప్రూవల్ లభించినట్లు వీసీ చెప్పారు. 11, 12 ఫైవ్ఇయర్ ప్లానింగ్ కమిషన్కు సంబంధించిన వన్ టైం క్యాచ్అప్గ్రాంట్, వుమెన్స్ హాస్టల్ నిర్మాణం, జనరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ స్కీంలకు యూజీసీ అప్రూవ్ చేసిందని అన్నారు. యూజీసీ జాయింట్సెక్రటరీ షకీల్ అహ్మద్, ఇండియన్నేషనల్ సైన్స్ అకాడమీ ప్రిన్సిపల్ సెక్రటరీ మాధవేంద్రలను కలిసి అకడమిక్పరమైన సహయ సహకారలతో పాటు టీయూకి నిధులను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. యూజీసీ డైరెక్టర్ ఆంజనేయులు, ఐక్యూఏసీ చంద్రశేఖర్ ఆయన వెంట ఉన్నారు.
లింగంపేటలో వీఆర్ఏల భిక్షాటన
లింగంపేట, వెలుగు: ముప్పై రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోకపోవడం సరికాదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా మంగళవారం లింగంపేట మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం లీడర్లు రవి, బాలరాజ్, కాశీరాం, లావణ్య, ఎగ్గడి సాయిలు, నీరడి సాయిలు పాల్గొన్నారు.
సంజయ్ అరెస్టుపై బీజేపీ నిరసనలు
కామారెడ్డి, వెలుగు: ప్రజల కోసం యాత్ర చేస్తున్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ను పోలీసులు అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డిలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక యాత్రను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ భరత్, టౌన్ ప్రెసిడెంట్ విపుల్, జిల్లా జనరల్ సెక్రటరీ తేలు శ్రీనివాస్, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీలంచిన్న రాజులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. లీడర్లు వేణుగోపాల్గౌడ్, ప్రదీప్, రమేశ్ పాల్గొన్నారు.
కేసీఆర్కు ఓటమి భయం పట్టుకట్టుకుంది
భిక్కనూరు: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎక్కడ డిపాజిట్ గల్లంతు అవుతుందోనన్న ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీపై అధికార జులుం చూపిస్తోందని ఆ పార్టీ లీడర్లు ఆరోపించారు. సంజయ్ అరెస్టును నిరసిస్తూ పార్టీ మండల ధ్యక్షుడు రెడ్డిగారి రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో చిన్నోళ్ళ శంకర్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, బస్వారెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
బాన్సువాడ: బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బాన్సువాడ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, భాస్కర్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.
కవిత ఇంటిపై దాడి సరికాదు
కామారెడ్డి/ధర్పల్లి/బోధన్/ఇందల్వాయి/డిచ్పల్లి, వెలుగు: హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఇంటిపైకి బీజేపీ నాయకులు దాడికి వెళ్లడం సరికాదని టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ఎంకే.ముజీబొద్దీన్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ధర్పల్లిలో టీఆర్ఎస్నాయకులు ప్రెస్మీట్ నిర్వహించి దాడి ఘటనను ఖండించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్యాదవ్, ఎంపీపీ సారికా హన్మంత్రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్, విండో చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. బోధన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వి.ఆర్ దేశాయ్, మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ రాజేశ్వర్, టీఆర్ఎస్మండల ప్రెసిడెంట్నర్సయ్య పాల్గొన్నారు. టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ కూడా బోధన్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ప్రెస్మీట్నిర్వహించి ఖండించారు. ఇందల్వాయిలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ చిలువెరి దాసు ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. డిచ్పల్లిలో పార్టీ మండల ప్రెసిడెంట్శ్రీనివాస్రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించి కేంద్రం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శిక్షణ
కామారెడ్డి, వెలుగు: జనవిజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జాతీయ వైస్ ప్రెసిడెంట్ ఉప్పునూతుల నాగరాజుగౌడ్తెలిపారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7న కామారెడ్డిలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. మానవ సంబంధాలు, సైన్స్, రోగాలు తదితర ఆంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.
మంగిరాములు మహరాజ్కు మాతృ వియోగం
నందిపేట, వెలుగు: మండల కేంద్రానికి సమీపంలోని కేదారీశ్వర ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహరాజ్ తల్లి మంగి లక్ష్మమ్మ (88) మంగళవారం మృతి చెందారు. మెదక్ జిల్లా పోతిరెడ్డిపేటకు చెందిన లక్ష్మమ్మ కుటుంబం 50 ఏళ్ల కింద నందిపేటకు వలస వచ్చారు. కొన్నాళ్లకే మహరాజ్ పలుగు గుట్ట సమీపంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉన్న లక్ష్మమ్మ నిత్యం ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తుండేది. వయసు మీద పడడంతో మంగళవారం చనిపోయింది. ఆమె అంత్యక్రియలు బుధవారం ఆశ్రమంలో నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
కామారెడ్డి, వెలుగు: టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ సి.హెచ్ అనిల్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డిలో టీపీటీఎఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యారంగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, డెవలప్మెంట్ ఫండ్స్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో మండల శాఖ ప్రెసిడెంట్ గోపు శ్రీనివాస్, ప్రతినిధులు ప్రకాశ్, చక్రపాణి, లక్ష్మి, నాగభూషణం పాల్గొన్నారు.