బలహీన వర్గాల ప్రజల స్థితిగతులు తెలుసుకొని రిజర్వేషన్లు కల్పించేందుకు 1978లో బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పడిందని.. 1990లో కమిషన్ నివేదిక ఇచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘దేశంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నదని, వాళ్లకు 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ రికమండ్ చేసింది. ఆ రికమండేషన్స్ను వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేస్తున్నమంటే.. ‘కమండల్’ పేరిట ఎల్ కే అద్వానీ రథయాత్ర చేపట్టారు.
మండల్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు” అని వివరించారు. నాడు రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్తే.. రిజర్వేషన్లు న్యాయసమ్మతమైనవేనని, కొనసాగించాలని తొమ్మిది మంది సభ్యులతో కూడి ధర్మాసనం చెప్పిందని ఆయన తెలిపారు. ‘‘బలహీనవర్గాల జనాభాను లెక్కించాలని, రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించొద్దని కోర్టు చెప్పింది. 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తుండటంతో
ఇంకో 27శాతం బీసీలకు ఇస్తే 50శాతంలోపే అవుతుందని, అంతకు మించొద్దని కోర్టు సూచించింది. ఈ 50 శాతం పరిమితిని తొలగించాలంటే దేశంలోని బీసీల జనాభాను మొత్తం లెక్కించాలని ఇంద్రసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది” అని ఆయన వివరించారు.