మేడారం మహాజాతరతో ఆర్టీసీకి రూ.20.24 కోట్ల ఆదాయం

మేడారం మహాజాతరతో ఆర్టీసీకి రూ.20.24 కోట్ల ఆదాయం

కాశీబుగ్గ, వెలుగు: మేడారం మహాజాతరతో ఆర్టీసీకి రూ.20.24 కోట్ల ఆదాయం సమకూరింది. సోమవారం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సమావేశం నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన ఆర్టీసీ ఈడీ కేఆర్‌‌‌‌జడ్పీ సోలోమన్ మాట్లాడుతూ.. మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులను సురక్షితంగా జాతరకు తీసుకెళ్లి, గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను అభినందించారు. ప్రయాణికుల రద్దీ మధ్య క్రమశిక్షణతో, సమన్వయంతో డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీ చేశారని కొనియాడారు.

వరంగల్  ఆర్ఎం దర్శనం విజయభాను మాట్లాడుతూ 1,711 బస్సులతో 25,027 ట్రిప్పులు నడిపించామని చెప్పారు. 28,06,155 కిలోమీటర్లు బస్సులు నడిపించడం ద్వారా రూ.20,24,28,124 ఆదాయం సమకూరిందని తెలిపారు. 12,33,585 మంది ప్రయాణించగా, 6,08,686 మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు. డిప్యూటీ ఆర్ఎంలు కె. భాను కిరణ్, పి మహేశ్  పాల్గొన్నారు.