పనాజి: 2013లో తోటి మహిళా ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో తెహెల్కా పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు విధించిన శిక్షను పెంచాలని కోరుతూ గోవా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. తేజ్ పాల్కు పదేండ్ల జైలు శిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని పిటిషన్లో కోరింది.
అసలేం జరిగిందంటే..?
2013లో తెహెల్కా ఎడిటర్ తేజ్ పాల్ సింగ్ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఆయన జూనియర్ జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించింది. థింక్ ఫెస్ట్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో.. హోటల్ ఎలివేటర్ లోపల తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ కేసులో 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ మొదలై.. 2021లో ఆయనను నిర్దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్పై బాంబే హైకోర్టు 2026, ఆగస్ట్ 6న సంచలన తీర్పు వెలువరించింది. తేజ్ పాల్ను దోషిగా తేలుస్తూ.. 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తేజ్ పాల్కు 10 ఏండ్ల జైలు శిక్ష సరిపోదని భావించిన గోవా సర్కార్.. బాంబే హైకోర్టు గోవా బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తేజ్ పాల్కు 10 ఏండ్ల జైలు శిక్ష కాకుండా జీవిత ఖైదు విధించాలని ప్రభుత్వం అభ్యర్థించింది.
