హైదరాబాద్: రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై నిఘా పెట్టి ప్రత్యేక తనిఖీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్ నగరమంతటా ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు. ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. లైసెన్స్ లేని వారు వెంటనే ఆర్టీఏ కార్యాలయం ద్వారా పొందాలని సూచించారు.
నగరంలో జరుగుతున్న ఎక్కువ రోడ్డు ప్రమాదాలకు లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణం అని పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనం ఇచ్చిన యజమానుల పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల్లో తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రోడ్డు భద్రత కోసం ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
►ALSO READ | మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలు.. కారులో రూ.5 లక్షల డబ్బు దొరికింది !
