కరోనా రహిత దేశంగా న్యూజిలాండ్ ప్రకటించుకుంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా ను కట్టడి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వైరస్ పై విజయం సాధించలేకపోయాయి. న్యూజిలాండ్ మాత్రం ప్రణాళికాబద్దంగా, వ్యూహాత్మక కట్టడి చర్యలతో మహమ్మారి వైరస్ పై విజయం సాధించింది. దేశంలో చిట్టచివరి కరోనా బాధితురాలు కూడా పూర్తిగా కోలుకుందని ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్వయంగా ప్రకటించారు. అయితే ప్రకటన చేసిన కొద్ది రోజులకే …దేశంలో కొత్తగా మళ్లీ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
బ్రిటన్ నుంచి న్యూజిలాండ్ వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సుమారు 24 రోజుల తర్వాత ఆ దేశంలో మళ్లీ మొదటి సారి వైరస్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం న్యూజిలాండ్ లాక్ డౌన్ ఆంక్షలను కూడా ఎత్తేసింది. భవిష్యత్తులో తమ దేశంలో కొత్తగా కరోనా కేసులు మళ్లీ నమోదయ్యే అవకాశాలున్నాయని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాని జెసిండా ప్రజలను హెచ్చరించారు.