నిమ్స్ లో బెడ్లు లేవు.. వెల్ నెస్ సెంటర్లలో అడ్మిట్..మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు

నిమ్స్ లో బెడ్లు లేవు.. వెల్ నెస్ సెంటర్లలో అడ్మిట్..మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు

మహబూబ్​నగర్​, వెలుగు : ఆఫీసర్లు ఫీల్డ్​విజిట్​కు వెళ్తేనే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్​నగర్​కలెక్టరేట్​లో శుక్రవారం ఉదయం పాలమూరు, నారాయణపేట జిల్లాలకు సంబంధించి వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్​ యువ వికాసం, భూ భారతి, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్​, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, రాంమోహన్​ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలను వారు ప్రస్తావించారు.

నిమ్స్​కు రెఫర్​చేస్తే.. 

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తుండగా.. మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్యేలు జీఎంఆర్​, శ్రీహరి, పర్ణికారెడ్డి స్పందించారు. తమ నియోజకవర్గాల నుంచి రోడ్డు ప్రమాద బాధితులను పాలమూరు జనరల్​హాస్పిటల్​కు పంపిస్తే కొందరు డాక్టర్లు, అంబులెన్స్​డ్రైవర్లు దందాలు చేస్తున్నట్లు బయటపడిందన్నారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్​కు రెఫర్​ చేస్తే.. అంబులెన్స్​ డ్రైవర్లు అమీర్​పేట్​లోని ఓ ప్రైవేట్ వెల్​నెస్​ సెంటర్​కు తరలిస్తున్నారన్నారు.  

వెల్​నెస్​ సెంటర్​లో  రూ.10 లక్షల బిల్లు చేస్తే రూ.7 లక్షలు కట్టించుకున్నారని, మిగతా రూ.3 లక్షలు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామని చెప్పడంతో బాధితులు తనను ఆశ్రయించినట్లు ఎమ్మెల్యే శ్రీహరి చెప్పారు.  తన నియోజకవర్గంలో ఓ యాక్సిండెంట్​ బాధితుడిని నిమ్స్​లో బెడ్స్​లేవని వెల్​నెస్​సెంటర్​లో చేర్పించే ప్రయత్నం చేశాడని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. వెంటనే నిమ్స్​కు వెళ్లి తనే బెడ్​సమకూర్చానన్నారు. 

ఇలాంటి దందానే ఎమ్మెల్యే జీఎంఆర్​కూడా ప్రస్తావించారు. మంత్రి దామోదర స్పందించి.. ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​ను ఆఫీసర్లు ప్రతి నెలా తనిఖీలు చేయాలని ఆదేశించారు. త్వరలో నారాయణపేట జిల్లాలో వైద్య శాఖ తీరుపై సమీక్ష పెడతామని చెప్పారు.