
మహబూబ్నగర్, వెలుగు : ఆఫీసర్లు ఫీల్డ్విజిట్కు వెళ్తేనే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్నగర్కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం పాలమూరు, నారాయణపేట జిల్లాలకు సంబంధించి వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, భూ భారతి, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, రాంమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు అంశాలను వారు ప్రస్తావించారు.
నిమ్స్కు రెఫర్చేస్తే..
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షిస్తుండగా.. మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్యేలు జీఎంఆర్, శ్రీహరి, పర్ణికారెడ్డి స్పందించారు. తమ నియోజకవర్గాల నుంచి రోడ్డు ప్రమాద బాధితులను పాలమూరు జనరల్హాస్పిటల్కు పంపిస్తే కొందరు డాక్టర్లు, అంబులెన్స్డ్రైవర్లు దందాలు చేస్తున్నట్లు బయటపడిందన్నారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు రెఫర్ చేస్తే.. అంబులెన్స్ డ్రైవర్లు అమీర్పేట్లోని ఓ ప్రైవేట్ వెల్నెస్ సెంటర్కు తరలిస్తున్నారన్నారు.
వెల్నెస్ సెంటర్లో రూ.10 లక్షల బిల్లు చేస్తే రూ.7 లక్షలు కట్టించుకున్నారని, మిగతా రూ.3 లక్షలు చెల్లిస్తేనే డెడ్ బాడీని ఇస్తామని చెప్పడంతో బాధితులు తనను ఆశ్రయించినట్లు ఎమ్మెల్యే శ్రీహరి చెప్పారు. తన నియోజకవర్గంలో ఓ యాక్సిండెంట్ బాధితుడిని నిమ్స్లో బెడ్స్లేవని వెల్నెస్సెంటర్లో చేర్పించే ప్రయత్నం చేశాడని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. వెంటనే నిమ్స్కు వెళ్లి తనే బెడ్సమకూర్చానన్నారు.
ఇలాంటి దందానే ఎమ్మెల్యే జీఎంఆర్కూడా ప్రస్తావించారు. మంత్రి దామోదర స్పందించి.. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ను ఆఫీసర్లు ప్రతి నెలా తనిఖీలు చేయాలని ఆదేశించారు. త్వరలో నారాయణపేట జిల్లాలో వైద్య శాఖ తీరుపై సమీక్ష పెడతామని చెప్పారు.