వారణాసిలో నిజామాబాద్ పసుపు రైతుల నామినేషన్

వారణాసిలో నిజామాబాద్ పసుపు రైతుల నామినేషన్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎంపీగా పోటీ చేస్తున్న లోక్ సభ నియోజకవర్గం వారణాసి నుంచి బరిలోకి దిగేందుకు నిజామాబాద్ రైతులు సిద్ధమయ్యారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు చలో వారణాసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా.. నరేంద్రమోడీపై పోటీ చేయాలని నిర్ణయించామని పసుపు రైతుల చెప్పారు.

తమిళనాడు పసుపు రైతులు కూడా నామినేషన్లు వేయడానికి తమతో పాటు వారణాసికి వస్తున్నారని తెలంగాణ పసుపు రైతుల సంఘం ప్రకటించింది. పసుపు బోర్డు సాధన, మద్దతు ధర పెంచుకోవడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు పసుపు రైతులు. సమస్యకు పరిష్కారం ఇవ్వాలని కోరుతూ.. పార్టీల నాయకులను కలుస్తామన్నారు. బీజేపీ ఇన్నాళ్లు పసుపు బోర్డు ఇవ్వకుండా… గెలిచిన  తర్వాత గంటల వ్యవధిలోనే ఇస్తామని.. రాజకీయ ప్రయోజనాలకోసమే చెప్పిందని ఆరోపించారు.

29 వరకు నామినేషన్లకు గడువు ఉన్నందున… వీలైనంత మంది ఎక్కువ రైతులు తమకు మద్దతుగా వారణాసికి రావాలని పిలుపునిచ్చారు.