- మరోసారి తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
- సుప్రీంకోర్టులో 129 పేజీల అఫిడవిట్ దాఖలు
సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) ముమ్మాటికీ రాజ్యాంగబద్ధమైందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి తన స్టాండ్ను స్పష్టం చేసింది. ఈ చట్టంతో దేశంలోని ఏ ఒక్కరికీ నష్టం ఉండబోదని తేల్చిచెప్పింది. ఏ ఒక్క ఇండియన్ప్రాథమిక హక్కులకు సీఏఏ విఘాతం కలిగించబోదని తెలిపింది. దేశ ప్రజల లీగల్, డెమొక్రటిక్, సెక్యులర్ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేసింది. మతం కోణంలో దీన్ని చూడటం సరికాదని, మత హింసను ఎదుర్కొంటున్న శరణార్థుల అంశంగానే చూడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తేల్చిచెప్పింది. సీఏఏను వ్యతిరేకిస్తూ, దాని రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 140కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు వివరణ కోరగా.. మంగళవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ బీసీ జోషి అఫిడవిట్ దాఖలు చేశారు. 129 పేజీల అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం తన స్టాండ్ను కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అసలు ఈ చట్టంతో దేశంలోని పౌరుల సిటిజన్షిప్కు సంబంధం ఏ మాత్రం లేదని తెలిపింది. సీఏఏతో ప్రభుత్వానికి ఎలాంటి అసాధారణ అధికారాలు దక్కవని కూడా స్పష్టం చేసింది.
ఆ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్లకే
మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు మతపర హింసను ఎదుర్కొంటున్నారని, వారు శరణార్థులుగా వచ్చినందున వారికి సిటిజన్షిప్ కల్పించేందుకు ఈ చట్టాన్ని పార్లమెంట్చేసిందని కేంద్రం తన అఫిడవిట్లో గుర్తుచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడే చట్టంలో సవరణలు చేసిందని వివరించింది. 2014 డిసెంబర్ 31 ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినవారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏ మత స్వేచ్ఛకు ఇది భంగం కలిగించబోదని తెలిపింది. ఆ మూడు దేశాల ముస్లింలకు దీన్ని వర్తింపజేయకపోవడం ఏమిటన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఆయా దేశాల్లోని మైనార్టీలకు మాత్రమే సీఏఏ వర్తిస్తుందని, మతపర హింసను ఎదుర్కొంటున్న వారి కోసమే రూపొందించిందని పేర్కొంది. సీఏఏకు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కి ముడిపెడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ రెండింటికీ సంబంధమే లేదని తేల్చిచెప్పింది.