- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్
గోదావరిఖని, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లో మొదటి దశలో 1,600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని ఎన్టీపీసీ ఈడీ సునీల్ కుమార్ తెలిపారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగితే, మిగిలిన 2,400 మెగావాట్ల రెండో దశ ప్లాంట్ పనులు చేపట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ మిలీనీయమ్ హాల్లో మీడియాతో మాట్లాడారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్లో నిర్మించిన మొదటి 800 మెగావాట్ల ఆల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లో ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి మొదలైందని చెప్పారు.
క్రమంగా విద్యుత్ లోడ్ పెంచుతూ మే 15నాటికి పూర్తిస్థాయి విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తామని చెప్పారు. జూన్ చివరి నాటికి రెండవ యూనిట్లో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్లాంట్లో రెండు యూనిట్లలో 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, అందులో 85 శాతం కేటాయింపులు ఉండడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మరో 185 మెగావాట్ల ఉత్పత్తికి ఏర్పాట్లు రామగుండం ప్రాంతంలో మరో 185 మెగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో 70 మెగావాట్లు ప్లోటింగ్ సోలార్ పవర్ ఉంటుందని సునీల్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ అనుమతిస్తే రామగుండం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద కూడా ప్లోటింగ్ సోలార్ పవర్ను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.