గాంధీ నర్సుల సమ్మె.. ట్రీట్‌మెంట్‌పై ఎఫెక్ట్

గాంధీ నర్సుల సమ్మె.. ట్రీట్‌మెంట్‌పై ఎఫెక్ట్

పద్మారావునగర్ (హైదరాబాద్), వెలుగు: గాంధీ హాస్పిటల్.. రాష్ట్రంలో అతిపెద్ద కరోనా ఆసుపత్రి. ఇక్కడ మొత్తం కరోనా పేషెంట్లే. కానీ దవాఖనలో రోజూ ఏదో ఒక సమస్య. మొన్న జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేశారు.. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ నర్సులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా కరోనా పేషెంట్లకు అందిస్తున్న సేవలపై ఎఫెక్ట్ పడుతోంది. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, జీతాలను రూ.17 వేల నుంచి రూ.35 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నుంచి ఔట్‌సోర్సింగ్ నర్సులు సమ్మె చేస్తున్నారు. దీంతో సరైన సేవలు అందక గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.

800 మంది పేషెంట్లు.. 130 మంది నర్సులు

ప్రస్తుతం గాంధీలో సాధారణ, ఐసీయూ వార్డుల్లో 800 మంది వరకు కరోనా పేషెంట్లు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీరికి నర్సుల సేవలు 24 గంటలూ అవసరం. ప్రతి నిమిషం పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండాలి. గాంధీలో 180 మంది వరకు పర్మనెంట్ నర్సులు ఉన్నారు. ఇందులో 50 మంది దాకా సెలవుల్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన 130 మంది నర్సులు.. 800 మందికిపైగా ఉన్న కరోనా రోగులకు సేవలు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిపై పని ఒత్తిడి భారీగా ఉంది. ఔట్ సోర్సింగ్ నర్సుల సమ్మె ప్రభావం వైద్యులపై పడింది. నర్సులు లేకపోవడంతో వారి పనులు కూడా డాక్టర్లే చేయాల్సిన పరిస్థితి.

పట్టించుకుంటలే..: ఓ నర్సు ఆవేదన

కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఓ నర్సు.. వాట్సాప్ ద్వారా ఆడియో క్లిప్పింగ్ ను వెలుగు ప్రతినిధికి పంపారు. ‘‘అత్తెసరు జీతాలతో నర్సులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్, హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ పట్టించుకోకపోవడం అన్యాయం. తక్కువ జీతాలు తీసుకుంటున్న ఔట్ సోర్సింగ్ నర్సులకే పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఐదుగురు ఔట్ సోర్సింగ్ నర్సులకి కరోనా సోకింది. సోమవారం నుంచి ఔట్ సోర్సింగ్ నాలుగో తరగతి సిబ్బంది కూడా నిరవధిక సమ్మెకు దిగుతున్నామని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి’’ అని కోరారు.

ఇన్సురెన్స్ ఉన్నవాళ్లకు సర్కారీ ప్యాకేజీలు చెల్లవ్