
మనస్తాపంతో ఓ నర్సింగ్ ట్రెయినింగ్ విద్యార్థి గాంధీ ఆస్పత్రి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం మూడున్నర గంటల సమయంలో గాంధీ ఆస్పత్రి అడ్మినిస్టేషన్ బిల్డింగ్ ఐదవ అంతస్తు పై నుండి సెల్లార్ లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి దగ్గర లభించిన ఆధార్ ప్రకారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోహన్ భాయ్(22)గా గుర్తించారు. రోహన్ భాయ్ తండ్రి దినేష్ భాయ్ అనే పేరుతో ఇతని ఆధార్ కార్డ్ ఉన్నట్లు తెలిపారు.మృతుని దగ్గర విజయ నర్సింగ్ స్కూల్ సంబంధించిన రిసిప్ట్ ఉందన్నారు. మృతుడు విజయ హెల్త్ కేర్ కాలేజీ లో GNM నర్స్ కోర్స్ చేస్తున్నాడు. కీసర,నాగరంలో విజయ నర్సింగ్ స్కూల్ లో కోర్సు చేస్తూ.. అక్కడే హాస్టల్ లో ఉంటున్నట్లు చెప్పారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాని మార్చురీకి తరలించారు.మృతునికి సంబంధించిన బంధువుల వివరాలు తీయాల్సి ఉందని, సూసైడ్ చేసుకోవడానికి మరేమైనా కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.