బండ్ల గూడ, పోచారం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు తీసుకోండి

బండ్ల గూడ, పోచారం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు తీసుకోండి
  • ప్రభుత్వ శాఖలకుఅధికారుల లేఖలు
  • ఉద్యోగులూ కొనకుంటేపబ్లిక్​కు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ ఫ్లాట్లను తీసుకోవాలని అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులను హౌసింగ్ అధికారులు కోరారు. ఈ మేరకు సీఎస్ ఆదేశాలతో  అన్ని శాఖలకు లేఖలు రాశారు. 6 సార్లు వేలం నిర్వహించినా ఈ ఫ్లాట్లు ఇంకా పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. దాంతో వాటిని కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులు చాన్స్ ఇచ్చారు. వీళ్లు కూడా ముందుకు రాకపోతే  ఓపెన్ సేల్ విధానంలో పబ్లిక్ కు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉంచుతామని చెబుతున్నారు.  

మొత్తం 795 ఫ్లాట్స్ 

బండ్లగూడ, పోచారంలో సింగిల్, డబుల్ బెడ్రూమ్ లు కలిపి సుమారు 795 ఫ్లాట్లు ఉన్నాయి.  బండ్లగూడలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్182 ఉండగా, పోచారంలో సింగిల్ 256,  డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 357 ఉన్నాయి. బండ్ల గూడలో 1 బీహెచ్ కే రూ.15లక్షలు, పోచారంలో సింగిల్ రూ.13లక్షలు, 2బీహెచ్ కే రూ.19లక్షలుగా నిర్ణయించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

గత నెల వేలానికి మంచి రెస్పాన్స్ 

గత నెలలో బండ్లగూడ , పోచారంలో ఫ్లాట్లను వేలం వేశారు. ఇందులో ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన వారికి ఫ్లాట్ ఇస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  బండ్ల గూడలో 34 త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్లకు ఏకంగా 364 మంది బిడ్ దాఖలు చేశారు. ప్రభుత్వం 3బీహెచ్ కే ఫ్లాట్ చదరపు అడుగు(ఎస్ఎఫ్ టీ)కి రూ.3 వేలు ఖరారు చేయగా.. అత్యధికంగా రూ.4400 పలికింది. అత్యల్పంగా రూ.3900 పలికింది. ఇలా 34 ఫ్లాట్లను వేలం వేయగా అన్ని అమ్ముడయ్యాయి. సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కొనేందుకు పబ్లిక్ ముందుకు రాకపోవటంతో డిపార్ట్ మెంట్లకు లేఖ రాశారు.

నెమ్మదిగా అమ్ముడవుతున్న టవర్లు

పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్​లో రాజీవ్ స్వగృహ అపార్ట్​మెంట్లను హౌసింగ్ అధికారులు టవర్ల వారీగా వేలానికి పెట్టారు. వీటిని గుంపగుత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్లకు అమ్మనున్నారు. గాజుల రామారంలో  2 టవర్లను ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ తీసుకుందని 
ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. మరో 3 టవర్లను తీసుకునేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారని చెప్పారు. ఇక జవహర్ నగర్​లో  17 టవర్లలో మొత్తం 2800 ఫ్లాట్లు వేలానికి ఉంచగా, అక్కడ డంపింగ్ యార్డ్ వల్ల పొల్యూషన్, పొగ, దుర్వాసన ఉంటుందని  కొనేందుకు ఎవరూ ముందుకు రావటంలేదని అధికారులు చెబుతున్నారు.  పోచారంలో 4 టవర్లు ఇంకా  వేలానికి ఉన్నాయి.