ఓయూ, వెలుగు: ఓయూలో పీహెచ్డీ కోర్సులకు ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని అధికారులు తెలిపారు. గతేడాది పీహెచ్ డీ కోర్సుల ఫీజులను ఒక్కసారిగా రూ.20 వేల నుంచి లక్షకు పెంచారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజులను తగ్గించాలని..అప్పటిదాకా ఫీజులు చెల్లించబోమని నిరసన తెలిపారు.
దాంతో ఒకేసారిగా రెండేళ్ల ఫీజులు ఈనెల 30 లోగా చెల్లించాలని, లేకుంటే ఎగ్జామ్స్ రాయనీమని ఆయా విభాగాల డీన్లు నోటీసులు జారీచేశారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 23 నుంచి విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే విషయమై వీసీ, రిజిస్ర్టార్లతో విద్యార్థులు మంగళవారం సమావేశమయ్యారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అధికారులు ఫీజులపెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు అంగీకరించారు.