ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ ఓలా తమిళనాడులో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ (విద్యుత్ కార్ల తయారీ కోసం ప్లాంట్)ను ఏర్పాటు చేసేందుకు రూ. 2వేల ఎకరాల్లో రూ.7614 కోట్లు పెట్టుబడి పెట్టే పనిలో పడింది. దీని కోసం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. అయితే ఈ ప్లాంట్ ద్వారా దాదాదపు 3,111 మందికి ఉపాధి దొరకనుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని ట్వీట్ చేశారు. అయితే కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్ను ఏర్పాటు చేయాలనేది కంపెనీ ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్ తో వెళ్లే కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.