న్యూఢిల్లీ :ఫ్లిప్కార్ట్, ఫోన్పే యాజమాన్య విభజన పూర్తయింది. ఇక నుంచి ఈ రెండు సంస్థలు అమెరికా ఆధారిత రిటైల్ కంపెనీ వాల్మార్ట్ కింద కార్యకలాపాలను కొనసాగిస్తాయి. డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్పేను 2016లో ఫ్లిప్కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. వాల్మార్ట్ నాయకత్వంలోని ఫ్లిప్కార్ట్ సింగపూర్, ఫోన్పే సింగపూర్ వాటాదారులు నేరుగా ఫోన్పే ఇండియాలో వాటాలను కొనుగోలు చేశారు. దీనివల్ల ఫోన్పే పూర్తిగా భారతదేశ కంపెనీగా మారింది. ఈ పని ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలయింది. వాల్మార్ట్ రెండు సంస్థల్లోనూ మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. ఫ్లిప్కార్ట్, ఫోన్పేలకు 40 కోట్ల చొప్పున యూజర్ బేస్ ఉంది. తాము కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మరింత వృద్ధి సాధిస్తామని, ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.
ఈ సంవత్సరంలో ఫోన్పే తన డోమిసైల్ను సింగపూర్ నుండి భారతదేశానికి మార్చింది. ఫోన్పే దేశంలోని 99 శాతం పిన్ కోడ్లను కవర్ చేస్తుందని, 3.5 కోట్ల మంది ఆఫ్లైన్ వ్యాపారులు తమ నెట్వర్క్లో చేరారని కంపెనీ ప్రకటించింది. ఫోన్పే ఒక విజయవంతమైన సంస్థగా వృద్ధి చెందడం అభివృద్ధి చెందడం చూసి గర్విస్తున్నామని, కోట్లాది మంది మంది భారతీయులకు ఆర్థిక సేవలను అందించే టార్గెట్తో పనిచేయడం కొనసాగిస్తుందని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.