సరిహద్దు దాటిన పాక్ డ్రోన్: పేల్చేసిన ఎయిర్ ఫోర్స్

సరిహద్దు దాటిన పాక్ డ్రోన్: పేల్చేసిన ఎయిర్ ఫోర్స్

బికనేర్: పాక్ ఆర్మీ పన్నాగాన్ని మరోసారి భారత వాయుసేన భగ్నం చేసింది. భారత సరిహద్దు వెంట నిఘాకు యత్నించిన పాక్ డ్రోన్ ను పేల్చేసింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో భారత గగనతలంలోకి పాక్ డ్రోన్ ఒకటి ప్రవేశించింది. రాజస్థాన్ లోని బికనేర్ వద్ద సరిహద్దు ప్రాంతంలోని పరిస్థితులపై కన్నేసేందుకు వచ్చిన డ్రోన్ ను భారత వాయుసేన గుర్తించింది. ఇక్కడి నల్ సెక్టార్ లోకి డ్రోన్ రాకను ఐఏఎఫ్ రాడార్ వ్యవస్థ అలర్ట్ చేసింది. వెంటనే సుకోయి 30ఎంకేఐ సాయంతో దాన్ని పేల్చేశారు వాయుసేన అధికారులు. డ్రోన్ శకలాలు పాకిస్థాన్ వైపునున్న ఫోర్ట్ అబ్బాస్ ప్రాంతంలో పడిపోయాయి.

అయితే డ్రోన్ ను పేల్చేసిన విషయాన్ని పాక్ మీడియా సంస్థలు ఖండించాయి.. అటువంటి ఘటనేదీ జరగలేదని కథనాలు ప్రసారం చేశాయి.

ఇటీవలే భారత గగనతలంలోకి పాక్ డ్రోన్ ప్రవేశించడం ఇది రెండోసారి. గత వారంలో పాక్ లోని బాలాకోట్ ప్రాంతంలో భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే గుజరాత్ రాష్ట్రం కచ్ వద్ద నున్న సరిహద్దులోనూ ఇలాంటి డ్రోన్ రావడంతో ఐఏఎఫ్ దాన్ని కూల్చేసింది.