బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందన్న ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ విలీన చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. నెహ్రూ, వల్లభాయ్పటేల్ కృషితోనే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు. హైదరాబాద్ విలీన కార్యక్రమాన్ని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఉత్తమ్సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రకు చెందిన రాంమాధవ్కు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ఉద్యమం చేశాయని చెప్పారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్లో కలపాలని నిజాం రాజు చూశారని, కానీ ఆపరేషన్ పోలోతో వల్లభాయ్పటేల్ దేశంలో విలీనం చేశారని గుర్తుచేశారు.
విలీన దినంపై కేసీఆర్వి కుంటిసాకులు
తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఏర్పాటుకు ముందు మాట్లాడిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కుంటిసాకులు చెబుతున్నారని ఉత్తమ్విమర్శించారు. హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని తెలంగాణ పరిరక్షణ దినంగా పాటిస్తూ పీసీసీ ఆధ్వర్యంలో కోఠిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయంలో విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఒక్క రోజు కూడా వారి ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదని, ఇది సిగ్గుచేటని అన్నారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటం చరిత్రాత్మకమైనదని కొనియాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వారు ప్రస్తుతం ఆ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
సభ్యత్వ నమోదు పక్కాగా ఉండాలి: కుంతియా
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని, ఇంట్లో కూర్చొని సభ్యత్వాలు చేయించొద్దని ఏఐసీసీ ఇన్చార్జి ఆర్సీ కుంతియా పీసీసీ నేతలకు సూచించారు. క్రియాశీల సభ్యత్వాలు అవసరం లేదని, అన్నీ సాధారణ సభ్యత్వాలనే చేయించాలన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్అధ్యక్షతన గాంధీభవన్లో మంగళవారం జరిగిన పీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు కుంతియా దిశానిర్ధేశం చేశారు. నియోజకవర్గానికి 30 వేల చొప్పున సభ్యత్వాలు చేయించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉందని, స్పష్టత వచ్చాక ముందుకెళ్దామని పార్టీ నేతలకు సూచించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాల విషయంలో వేసిన కమిటీ సిఫారసుల మేరకు ఉద్యమాన్ని కొనసాగిద్దామని కుంతియా చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ సూచించారు.


