హైదరాబాద్, వెలుగు : కరోనా సమయంలో బల్దియాలో ప్రజావాణి బంద్ పెట్టగా.. సుమారు మూడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో 2020 మార్చి 17న ప్రజావాణి నిలిపివేశారు. ఈనెల 8న సోమవారం నుంచి సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో మళ్లీ నిర్వహించనున్నారు.
గ్రేటర్ లోని ప్రజలు వివిధ సమస్యలపై బల్దియా ఆఫీసులకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఇటీవల ప్రజాభవన్ లో ప్రజావాణిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో సిటీకి చెందిన వారు చాలామంది ఉంటున్నారు.
సిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కిల్, జోనల్ ఆఫీసుల్లో ఇక ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. సంక్రాంతి తర్వాత హెడ్డాఫీసులో ప్రారంభిస్తామని చెప్పారు.