
- ఎంపీ ఆర్.కృష్ణయ్య ఫైర్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలను మోసం చేస్తూ సీఎం కేసీఆర్ బీసీల వ్యతిరేకిగా మారారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలను మోసం చేసేందుకే కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం స్కీం తెచ్చారని ఆరోపించారు. శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంఘాల సమావేశం జరగగా.. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన బీసీ బంధు హామీ ఏమైందని కృష్ణయ్య ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.