స్వచ్ఛ కార్మికుల్లో ఓ కుటుంబానికి ఒక ఏరియా ఉంటే అది వారి ఆస్తి కిందనే పరిగణిస్తారు. ఒక్కొక్కరికి సుమారు 200 ఇండ్ల నుంచి 500 ఇండ్ల వరకు ఉంటున్నాయి. తల్లిదండ్రుల తదనంతరం ఆ ఏరియా పిల్లలకు బదలాయిస్తారు. ఇందులో బల్దియా ప్రమేయం ఏ మాత్రం ఉండదు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో 6 వేల మంది స్వచ్ఛ కార్మికులు ఉండగా, ఇప్పుడు వీరి సంఖ్య 3 కమిషనరేట్ల పరిధిలో 10 వేలకు చేరింది. ఇప్పుడు చాలా మంది స్వచ్ఛ కార్మికులు ఆదాయం పెంచుకోవడానికి రాంకీ కలెక్ట్చేస్తున్న షాపుల నుంచి కూడా చెత్త సేకరించడం మొదలుపెట్టారు. అడిగితే గొడవలకు దిగుతున్నారు.
ఇండ్లల్లో ఒకవేళ చెత్త సేకరించకుంటే కంప్లయింట్చేసే అవకాశమే లేకుండా పోయింది. బల్దియాకు కంప్లయింట్చేసినా చర్యలు తీసుకునేవారు లేరు. గతంలో మేయర్గా, ప్రస్తుతం నాంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మాజిద్హుస్సేన్ ఓ మీటింగ్లో శానిటేషన్గురించి మాట్లాడుతూ.. తన ఇంటికే చెత్త తీసుకుపోవడానికి రావడం లేదని, అయినా తాను ఏం చేయలేకపోతున్నానని అనడం సమస్య తీవ్రతను తెలియజేసింది.
చెత్త సేకరణ అనేది ప్రధాన ఆదాయ వనరుగా మారగా.. దీన్ని ఆస్తిగా చూపుతూ వివాహాల సమయంలో అల్లుళ్లకు కట్నం కింద ఏరియాలు రాసిచ్చే వరకూ వెళ్లింది. కూకట్పల్లిలోని మైత్రినగర్లో 2 వేల ఇండ్లు ఉండగా, ఇందులో 500 ఇండ్లను అల్లుడికి కట్నం కింద అప్పగించాడో స్వచ్ఛ కార్మికుడు. ఎల్బీనగర్లోనూ ఓ వ్యక్తి తన అల్లుడికి కట్నం కింద ఏరియా రాసిచ్చాడు. ఇలా నగరంలో కూతుర్లకు పెండ్లి టైంలో ఇవ్వడానికి తండ్రులు ఏరియాలను కాపాడుకోవాల్సి వస్తున్నది. ఇంత డిమాండ్ ఉంది కాబట్టే హత్యల వరకూ వెళ్తున్నాయి.
