ఒకప్పుడు రౌడీ షీటర్లు, తర్వాత పొలిటీషియన్ల మధ్య ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం గొడవలు జరిగేవి. ఇప్పుడు హైదరాబాద్లో చెత్త సేకరణ దందా వ్యవహారం మాఫియా అవతరించడానికి కారణమైంది. ఏరియా నాదంటే నాదంటూ గ్రూపుల మధ్య గొడవలు జరిగి చివరకు హత్యల వరకు వెళుతున్నాయి. 4 నెలల క్రితం కేపీహెచ్ బీలో 10 ఇండ్లకు సంబంధించి చెత్త సేకరణ విషయంలోనూ ఓ కార్మికుడిని తోటి కార్మికులే హత్య చేశారు. గతనెలలో అబ్దుల్లాపూర్మెట్లోనూ చెత్త సేకరించే కార్మికుడిని తోటి కార్మికులు చంపబోయారు.
ఈ సంఘటన మరువక ముందే తాజాగా ఆదిభట్ల ఘటన జరిగింది. దీంతో అసలు స్వచ్ఛ కార్మికుల ఏరియాలకు ఇంత డిమాండ్ఎందుకు ఉంది? ఇంటికి రూ. 100 నుంచి నుంచి రూ.200 వరకు తీసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారా? ఇందుకోసం హత్యల వరకూ పోతున్నారా ? అని నగరవాసులు షాక్కు గురవుతున్నారు. చెంగిచెర్ల గణేశ్ నగర్కు చెందిన పండిపాటి బక్కయ్య అలియాస్ నాగరాజు (33), తన దగ్గరి బంధువులైన శ్రీశైలం, నరసింహతో కలిసి ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లోని కొన్ని ఏరియాల్లో చెత్త సేకరించేవాడు.
ఇక్కడ ఇండ్లతో పాటు హాస్టల్స్ లాంటి కమర్షియల్ప్రాంతాలు కూడా ఉండడంతో నెలకు రూ. లక్షల్లో సంపాదించేవారు. కొన్నేండ్ల కింద ఒక ఏరియా గురించి ముగ్గురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆదిభట్ల ప్రాంతంలో చెత్త సేకరించే ఓ స్వచ్ఛ కార్మికుడిని దారుణంగా చంపేశారు. మూడు నెలల కింద అపహరించి చంపి మూట కట్టి మూసీ నదిలో పడెయ్యగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
