కరోనా వైరస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో తన వంతు సాయంగా రూ.3 కోట్లు విరాళంగా ప్రకటించారు ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వైరస్ బాధితులే కాకుండా చాలా మంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనాపై పోరాటంలో వారందరికి తన వంతు సాయంగా ఏకంగా 3 కోట్లు విరాళమిచ్చి తన సేవాగుణాన్ని చాటుకున్నాడు లారెన్స్.
విరాళంగా అందజేసిన మొత్తంలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. ప్రధానమంత్రి సహాయనిధికి 50 లక్షలు.. డాన్సర్స్ అసోషియేషన్కు 50 లక్షలు.. 50 లక్షలు సినిమా కార్మికులకు.. వికలాంగులకు 25 లక్షలు.. 75 లక్షలు తన సొంతూరి వాళ్ళకు ఆయన ఇచ్చారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చంద్రముఖి-2 సినిమా కోసం తీసుకున్న ఈ 3 కోట్ల అడ్వాన్స్ మొత్తాన్ని కరోనాపై చేస్తున్న పోరాటానికి విరాళంగా ఇచ్చేసాడు లారెన్స్. పి.వాసు దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాను నటించడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.