
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులవివరాలు అందించాలని ఆదేశించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హాజరు కాని స్మితా సబర్వాల్
ఇరిగేషన్ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న సెక్రటరీ స్మితా సబర్వాల్ ఆ శాఖ రివ్యూలకు హాజరు కాలేదు. ఆదివారం తొలుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన మీటింగ్ కు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు ఆమె హాజరు కాలేదు.
విచారణకు కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిన అంశంపై విచారణకు కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఉదయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీలో ఈఎన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు కారణాలపై సమావేశంలో చర్చించారు. మేడిగడ్డతో పాటు ప్రాజెక్టులోని లోపాలపై సమగ్ర విచారణకు త్వరలోనే కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యారేజీ పునరుద్ధరణ పనులకు ఎల్ అండ్ టీ ముందుకు రాకుంటే లీగల్ ఫైట్ కు రెడీగా ఉండాలని అభిప్రాయానికి వచ్చారు.