
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, వాటి ఏర్పాటుకు అనుమతించాలని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఆదివారం సోమాజిగూడలో మంత్రిని యూనియన్ ప్రెసిడెంట్ వీరాంజనేయులు, రవీందర్ రెడ్డి, గంగాధర్, గీత, కృష్ణతో పాటు పలువురు నేతలు కలిసి వినితిపత్రం అందచేశారు. గత 9 ఏళ్లలో ఆర్టీసీ బస్సులు, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందని తెలిపారు.
రాష్ర్టంలో 4 వేల గ్రామాలకు బస్సులు లేవని చెప్పారు. ఆర్టీసీని లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా రవాణా సంస్ధగా పరిగణించాలన్నారు. బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వ ఈక్విటీకి మార్చాలని, డీజిల్ పై రాష్ర్ట ప్రభుత్వ వ్యాట్ ను తగ్గించాలన్నారు. కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2 పీఆర్సీలు, డీఏ బకాయిలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలన్నారు. బడ్జెట్ లో ఆర్టీసీకి నిధులను పెంచాలన్నారు. మహాలక్ష్మి స్కీమ్ రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే చెల్లించాలని నేతలు కోరారు.