హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలోని వందలాది పార్కులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. చెత్త, చెదారంతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ వాకింగ్ట్రాకులు ధ్వంసమై జనం నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం 938 పార్కులు ఉండగా జీహెచ్ఎంసీ ఏటా 15కోట్లు వరకు ఖర్చు చేస్తోంది. కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండట్లేదు. వీటిలో19 మేజర్ పార్కులు, 919 కాలనీల పార్కులు ఉన్నాయి. వందకుపైగా పార్కులను జీహెచ్ఎంసీ చూసుకుంటుండగా, కొన్నింటిని కాంట్రాక్టర్లకు అప్పగించింది. మిగిలిన 722 పార్కుల నిర్వహణను ఆయా కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్లు చూసుకుంటున్నాయి. అయ్యే ఖర్చులో 75% కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు అందిస్తుంది. అయితే వీఐపీలు వచ్చే పార్కులు మంచిగా ఉంటుండగా, కాలనీల పార్కులు చెత్త, గడ్డితో నిండిపోతున్నాయి. వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నింటిలో వాకింగ్ట్రాకులు కూడా లేవు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నడిచే దారిలేక, పాముల భయంతో రోడ్లపైనే వాకింగ్చేస్తున్నారు. 2020 ఆగస్టులో క్లీన్లీనెస్ డ్రైవ్లో భాగంగా ఓపెన్ జిమ్లు, క్రీడా సదుపాయాలు, స్టడీ రూంలను పట్టించుకోవాలని బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్ ఆదేశించారు. కానీ ఆ డ్రైవ్ కొన్నాళ్లకే మూలనపడింది.
విస్తీర్ణాన్ని బట్టి ఫండ్స్
జీహెచ్ఎంసీ ఆరు జోన్ల పరిధిలో 938 పార్కులు ఉన్నాయి. అధికారులు ఏటా వీటి మెయింటెనెన్స్కు దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విస్తీర్ణాన్ని బట్టి ఏడాదికి రూ.40 వేల నుంచి కోటికి పైగా ఖర్చు చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్లో117 పార్కులు ఉండగా వీటి మెయింటెనెన్స్కోసం ఏడాదికి మూడున్నర కోట్లు కేటాయిస్తున్నారు. సికింద్రాబాద్ జోన్లోని 90 పార్కులకు కోటి 20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. చార్మినార్ జోన్లోని 120 పార్కుల కోసం రూ.3 కోట్లు, కూకట్పల్లి జోన్లోని 156 పార్కుల కోసం రూ.3.5కోట్లు, ఎల్బీ నగర్ జోన్లోని 220 పార్కుల రూ.3కోట్లు, శేరిలింగంపల్లి జోన్లోని 200 పార్కుల కోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
వాటికి మాత్రమే లక్షల ఖర్చు
వీఐపీలు ఉండే ప్రాంతాల్లోని పార్కులపైనే జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మామూలు కాలనీల్లోని వాటిని పట్టించుకోవడంలేదు. గ్రేటర్ పరిధిలో అత్యధికంగా కేబీఆర్ పార్కు కోసం జీహెచ్ఎంసీ ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఏడాదికి రూ.కోటి15 లక్షలతో పార్కు మెయింటెనెన్స్చేస్తోంది. బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కుకు రూ.32 లక్షలు, లోటస్ పాండ్ పార్కుకు 20 లక్షలు, జూబ్లీహిల్స్లోని హెర్బల్ గార్డెన్ కోసం రూ.14 లక్షలు ఇలా వీఐపీలు ఉండే ప్రాంతాల్లోని పార్కులకు అధిక మొత్తంలో ఖర్చు పెడుతోంది. వీటిపై అధికారులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. అదే కాలనీల్లోని పార్కులు పూర్తిగా కరాబ్ అవుతున్నా ఎలాంటి చర్యలు ఉండడం లేదు. అయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని పార్కులు క్లీన్గా ఉంటున్నప్పటికీ వాటిని ఆనుకొని ఉన్న మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కును మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. మెయింటెనెన్స్లేక అస్తవ్యస్తంగా తయారైంది. పెద్ద పార్కును కూడా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
పాములు, కుక్కుల భయం
సిటీలోని చాలా కాలనీల పార్కుల్లో నిర్వహణ అనేదే కనబడడం లేదు. కొన్ని పార్కుల్లో పాములు, కుక్కల సంచారంతో జనం భయపడిపోతున్నారు. రాజేంద్రనగర్ పెద్దతాళ్ల కుంట పార్కులోకి రోజూ పదుల సంఖ్యలో కుక్కులు వస్తున్నాయి. చిన్న పిల్లలపై దాడి చేస్తున్నాయని జీహెచ్ఎంసీకి జనం ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని పార్కుల్లో ఎలక్ర్టిసిటీ బోర్డులు ప్రమాదకరంగా ఓపెన్గా ఉన్నాయి. మాసబ్ట్యాంక్ లోని చాచా నెహ్రూ పార్కులో వాకింగ్ ట్రాక్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. పాములు చేరే అవకాశంఉండడంతో వాకర్స్ఆందోళన చెందుతున్నారు. సిటీలోని వందలాది పార్కుల్లో ఇదే పరిస్థితి ఉంది.
బల్దియా ఫండ్స్ జీతానికే సరిపోవట్లే
పార్కు పూర్తిగా డ్యామేజ్అయ్యింది. వాకింగ్ ట్రాక్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. అధికారులను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు. కనీసం పార్కులో ఓపెన్ జిమ్ కూడా లేదు. డైలీ వందలాది మంది వాకర్స్వచ్చే పార్కులను పట్టించుకోకపోతే ఎలా? జీహెచ్ఎంసీ ఇచ్చే ఫండ్స్ వాచ్మన్ జీతానికి కూడా రావడం లేదు.
- మొయినుద్దీన్, ఆదిత్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, షేక్ పేట