
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్) ప్రణాళికలు రూపొందించింది. డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్లను పట్టుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్, సీఎస్ ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్, సీఎస్తో జరిగిన మీటింగ్స్లో టీఎస్ న్యాబ్ వ్యవస్థ, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించామని పేర్కొన్నారు.
డ్రగ్స్ కిట్స్ను అందుబాటులోకి తెస్తం..
డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా గ్రేహౌండ్స్, అక్టోపస్ తరహాలో టీఎస్ న్యాబ్ పనిచేస్తుందని సందీప్ శాండిల్య వెల్లడించారు. త్వరలో డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ని అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ తరహాలోనే ఇన్ స్టాంట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు ప్రోత్సాకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థలు, సినీ, ఐటీ ఇండస్ట్రీస్ ల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలతో అవగాహన కలిగిస్తామన్నారు. ఇందుకోసం కమిటీలను మరింత బలోపేతం చేస్తామన్నారు.