- ఎల్ఏసీ వద్ద చైనా సైనికులను ఎదుర్కొన్న గొర్రెల కాపర్లు
శ్రీనగర్: వాస్తవాధీన రేఖ వద్ద భారత గొర్రెల కాపరులు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లడఖ్లోని ఎల్ఏసీ వెంట గొర్రెలను మేపొద్దంటూ చైనా దళాలు అభ్యంతరం తెలుపగా.. భారత గొర్రెల కాపర్లు వారిని లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడిన వీడియో వైరల్గా మారింది. పాంగోంగ్ సరస్సు సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి భారతీయ గొర్రెల కాపరులు గొర్రెల ను మేపుతూ ఉంటారు.
2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత తాత్కాలికంగా మానేశారు. ఇటీవల గొర్లతో అక్కడికి వెళ్లిన కాపర్లను చైనా సైనికులు వారించారు. గొర్రెల కాపర్లు సైనికులను ఎదుర్కొని నిలబడ్డారు. ఆ ప్రాంతం భారత భూభాగంలోనే ఉందని వాదించారు. ఇంతలో భారత సైనికులు అక్కడికి చేరుకోవడంతో చైనా సైనికులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా ఎలాంటి హింస జరగలేదు. లడఖ్లోని కాక్జంగ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.