ప్రభుత్వం పడిపోతుందనడం కరెక్టు కాదు : దానం నాగేందర్

ప్రభుత్వం పడిపోతుందనడం కరెక్టు కాదు :  దానం నాగేందర్

హైదరాబాద్, వెలుగు: రేవంత్​రెడ్డి సీఎం కావాలని లక్ష్యం పెట్టుకుని రీచ్​అయ్యారని, అంత ఈజీగా ఆయన ఆ పదవిని వదులుకోరని బీఆర్ఎస్​ఎమ్మెల్యే దానం నాగేందర్​అన్నారు. కాంగ్రెస్​లో సీనియర్లంతా రిటైర్​అవుతారని, తానే సీఎం అని రేవంత్ రెండేండ్ల కిందనే చెప్పారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో దానం మీడియాతో చిట్​చాట్​చేశారు. పరిపాలనలో రేవంత్​చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు. ‘‘బీఆర్ఎస్​ఎమ్మెల్యేల్లో కొందరు ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని అనడం సరికాదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని కేసీఆరే చెప్పారు” అని పేర్కొన్నారు. ‘‘అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలుక్కున్నట్టుగా ఉంది. గత బీఆర్ఎస్​ప్రభుత్వాన్ని గెలికి తిట్టించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పెట్టి సభలో ప్రభుత్వం డిఫెన్స్​లో పడింది. హరీశ్​రావు, కేటీఆర్​లకు కాంగ్రెస్​మంత్రుల కౌంటర్లు సరిపోవడం లేదు. మంత్రులు సభకు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. తెలంగాణ అప్పులతో దివాలా తీసిందనే ఇండికేషన్​వెళ్తే రాష్ట్ర భవిష్యత్​ప్రమాదంలో పడుతుంది. పథకాల అమలు ఆలస్యం చేసేందుకే శ్వేతపత్రం ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇరిగేషన్​పై శ్వేతపత్రం పెడితే ప్రభుత్వం డిఫెన్స్​లో పడుతుంది” అని అన్నారు.