భార్యను పంపడం లేదని అత్తను చంపిండు 

భార్యను పంపడం లేదని అత్తను చంపిండు 

కొడిమ్యాల, వెలుగు :  అత్తగారింట్లో ఉన్న తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ అల్లుడు తన అత్తను మంగళవారం కట్టెతో తలపై కొట్టి హత్య చేశాడు. జగిత్యాల కొడిమ్యాల మండలం కోనాపూర్ విలేజ్ కు చెందిన జడ రాజవ్వ(50)కు ఇద్దరు బిడ్డలున్నారు. భర్త కొమురయ్య గతంలోనే చనిపోగా, ఇద్దరి బిడ్డల పెండ్లిళ్లు చేసింది. చిన్న బిడ్డ మౌనికను నాలుగేండ్ల కింద కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మేనల్లుడు ఔరగొండ గంగాధర్ కు ఇచ్చి మ్యారేజ్​ చేసింది. ఆరు నెలల కింద గంగాధర్ ​దుబాయ్​కి పోగా అప్పటి నుంచి భార్య మౌనిక తల్లి ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం అత్త ఇంటికి వచ్చిన గంగాధర్​తన భార్యను కాపురానికి పంపాలని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో అత్తకు, మేనల్లుడికి గొడవ జరగడంతో ఆవేశంతో పక్కనే ఉన్న కట్టెతో రాజవ్వ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మాల్యాల సీఐ రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తం చెప్పారు.