హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) 2 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షల్లో స్టూడెంట్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇచ్చిన పలు వెబ్సైట్లు సరిగా పనిచేయడం లేదు. మార్కులను అప్ లోడ్ చేసేందుకు టీచర్లు, హెడ్మాస్టర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఫార్మెటివ్ అసెస్ మెంట్ నాలుగు పరీక్షలతో పాటు ఎస్ఏ1 పరీక్షలు, మార్కులను అప్డేట్ చేశారు.
తాజాగా ఎస్ఏ 2 పరీక్షలు పూర్తవడంతో, ఈ స్టూడెంట్ల మార్కులను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఈ మార్కులను అప్లోడ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మొత్తం 9 సర్వర్లను పెట్టారు. వాటిలో సర్వర్లు పనిచేయడం లేదు. వెబ్ సైట్లు ఓపెన్ కావడం లేదు. దీంతో టీచర్లు, హెడ్మాస్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఈ నెల 24న స్టూడెంట్లకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులు అందించాల్సి ఉంది. ఈ మార్కులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే, ఆ కార్డులు వచ్చే అవకాశం ఉంది. దీంతో టీచర్లంతా ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.