శ్రీనగర్: హురియత్ సెపరటిస్ట్ నాయకుడు సయ్యద్ అలి షా గిలానీకి సహకరించిన ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్లను జమ్మూకాశ్మీర్ సర్కార్ సస్పెండ్ చేసింది. జమ్మూకాశ్మీర్ అంతటా నిషేధాజ్ఞలు ఉన్నా గిలానీకి మాత్రం 4 రోజుల పాటు ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు కొనసాగాయి. . ఆయనకు ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్లు సాయపడ్డారని తేలింది. ఆర్టికల్ 370 రద్దు ప్రకటనకు ముందే ఈనెల నాలుగో తేదీన కాశ్మీర్ అంతటా కమ్యూనికేషన్ సిస్టమ్పై కేంద్రం నిషేధాజ్ఞలు విధించింది. ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా పనిచేయలేదు. కంట్రోళ్లు ఉన్నా.. గిలానీకి మాత్రం ల్యాండ్ లైన్ , బ్రాడ్ బ్యాండ్ ఫెసిలిటీ ఈనెల ఎనిమిదో తేదీ ఉదయం వరకు కొనసాగింది.
తన ఎకౌంట్ నుంచి ట్వీట్ చేసేవరకు గిలానీకి ఇంటర్నెట్ ఫెసిలిటీ కొనసాగిందన్న విషయం అధికారులకు తెలియలేదు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎనిమిది ట్విటర్ ఎకౌంట్లను వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా కేంద్రం, జమ్మూకాశ్మీర్ పోలీసు యంత్రాంగం ట్విటర్కు లెటర్ రాసింది. ఈ 8 ఎకౌంట్ల ద్వారా కాశ్మీర్లోయలో నేతలు విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని తెలిపింది. గిలానీకి ఎలా ఇంటర్నెట్ వచ్చింది? ల్యాండ్లైన్ యాక్సిస్ ఎలా వచ్చింది? అన్న వ్యవహారంపై అధికారులు విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంటి దొంగలు ఇద్దరు గిలానీకి సాయపడ్డారని తెలియడంతో వెంటనే వాళ్లిద్దరిపై వేటు వేసింది.