
- జనావాసాలకుదూరంగా ఏర్పాటు
- చెత్తతో విద్యుదుత్పత్తిపై దృష్టిసారించాలని సూచన
- మొదటి దశలో 55 కి.మీ మేర మూసీ రివర్ ఫ్రంట్డెవలప్మెంట్
హైదరాబాద్, వెలుగు : జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డులు ఉండాలని, హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ డంపింగ్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం సెక్రటేరియెట్లో సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో డంపింగ్ యార్డులు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై చర్చించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ మొత్తానికి జవహర్ నగర్ లో ఒకే ఒక్క డంపింగ్ యార్డు ఉందని, ప్రతిరోజు దాదాపు 8 వేల టన్నుల చెత్త అక్కడికి చేరుతున్నదని పేర్కొన్నారు. దుర్వాసన, వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సిటీకి దూరంగా శంషాబాద్, మెదక్ వైపు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు గతంలో భూములు పరిశీలించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఆ భూములను మళ్లీ పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ‘‘చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. ఇందుకోసం టీఎస్ ఎస్పీడీసీఎల్ తో సమన్వయం చేసుకోవాలి. చెత్తను సాధ్యమైనంతవరకు రీసైకిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు.
అందుకే మెట్రో రూట్ మార్పు..
సామాన్యులకు ఉపయోగపడే విధంగా మెట్రో రైల్ రూట్ ను మారుస్తున్నామని రేవంత్ తెలిపారు. ‘‘గతంలో గచ్చిబౌలి–ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారు. కానీ దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ధనవంతులు ఉంటారు. వాళ్లు ఎక్కువగా సొంత వాహనాలే వాడుతురు.
గతంలో సర్వే చేసిన గౌలిగూడ–ఫలక్ నుమా–ఎయిర్ పోర్టు రూట్, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్ పోర్టు రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళ్తుంటారు. విదేశాలకు వెళ్లేటోళ్ల కుటుంబసభ్యులు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఈ రూట్ అనుకూలంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
మూసీ తీర ప్రాంతాల్లో అభివృద్ధి..
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొదటి దశలో 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు రేవంత్ తెలిపారు. నది పరీవాహక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ ఫౌంటెయిన్లు, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మూసీ తీర ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ, సెవెన్ టూంబ్స్, తారామతి బారాదరి వంటి వాటిని అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్ రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీపీపీ మోడల్ లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో చెక్ డ్యామ్స్ నిర్మించి వాటర్ ఫౌంటెయిన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు.