పిల్లల ప్రాణాలకు ముప్పు.. కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దు ..

పిల్లల ప్రాణాలకు ముప్పు..  కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దు ..
  •     బ్యాచ్ నెం. ఎస్ఆర్ 13 వాడకం నిలిపేయాలని డీసీఏ హెచ్చరిక
  •     విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమైనట్టు ఆరోపణలు రావడంతో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అనుమానిత కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్ 13 వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో దగ్గు మందు సేవించిన చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని కంచిపురం జిల్లా సుంగువార్చతిరానికి చెందిన శ్రీసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్రిఫ్ సిరప్ (పారాసెటమాల్, ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌‌‌‌ఫెనిరమైన్ మలేట్ కాంబినేషన్) బ్యాచ్ నెంబర్ ఎస్ఆర్13, మాన్యుఫ్యాక్చరింగ్ తేదీ మే 2025, ఎక్స్పైరీ తేదీ ఏప్రిల్ 2027 విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ)తో కలుషితమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ సిరఫ్‌ను వాడొద్దని డీసీఏ స్పష్టం చేసింది. ఈ బ్యాచ్ నెంబర్ గల సిరప్ ప్రజలు, డీలర్లు, మెడికల్ షాపుల్లో ఉన్నా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని డీసీఏ కోరింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు సమాచారం అందించవచ్చని పేర్కొంది. ఈ మేరకు డీసీఏ డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ షానవాజ్ ఖాసిం శనివారం ప్రకటన విడుదల చేశారు. 

ప్రభుత్వ మందుల్లో కోల్డ్రిఫ్ సిరప్ లేదు...

ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందుల్లో కోల్డ్రిఫ్ సిరఫ్ లేదని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు.  తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాకు సంబంధించి దగ్గుమందుల విషయంలో ఎలాంటి టెండర్లు లేవని వెల్లడించారు.