
కేంద్రానికి, పిటిషనర్కు
హైకోర్టు నోటీసులు
విచారణ 4 వారాలకు వాయిదా
హైదరాబాద్, వెలుగు: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల నిలిపివేతపై ఇచ్చిన స్టే ఆదేశాల్ని కోర్టు మరో 8 వారాలు పొడిగించింది. నవంబర్లో ఇచ్చిన స్టే ఉత్తర్వులను తాజాగా పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు. చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ ఈ మధ్య రద్దు చేసిన విషయం తెలిసిందే. హోం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించగా.. నవంబరు 22న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నాలుగు వారాలపాటు రద్దు ఉత్తర్వులను నిలిపివేయాలని పేర్కొంది. తాజాగా మరోసారి స్టే పొడిగింది. కేసు విచారణ సందర్భంగా రమేశ్కు జర్మనీ, ఇండియా పౌరసత్వం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే జర్మనీ పౌరసత్వాన్ని చెన్నమనేని ఇప్పటికే రద్దు చేసుకున్నారని ఆయన తరఫు లాయర్.. కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలను చూపించాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉందో లేదో చెప్పాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది. కేంద్రానికి, పిటిషనర్కు నోటీసులిచ్చిన బెంచ్.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రమేశ్ పౌరసత్వం చెల్లదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ గతంలో ఫిర్యాదుచేశారు. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం శాఖ పలుమార్లు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసింది.