సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా వైరస్ ను అరికట్టేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పొడిగించే అంశంపైనా చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయ మార్సులు రావడంతో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు – భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్టంలోని పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయ కొనుగోళ్లు తదితర అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. గత రెండు రోజుల్లో కురిసిన వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులకు అందిచాల్సిన ఆర్ధిక సాయం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.