తెలంగాణలో జిల్లాలవారీగా టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ముగిసినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్), టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) నోటిఫికేషన్లను జారీ చేయడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో గత 8 ఏండ్లలో ఒకే ఒక్కసారి టీఆర్టీ(డీఎస్సీ) నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి డీఎస్సీ వేసేశారు. కానీ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఐందేండ్లుగా బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన 5 లక్షల మంది అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 2 సంవత్సరాలుగా అదిగో టీఆర్టీ ఇదిగో నోటిఫికేషన్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడమే తప్ప.. నోటిఫికేషన్ మాత్రం రాలేదు. నోటిఫికేషన్లకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినందున వెంటనే టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లు విడుదలు చేయాలి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల సమయంలో టీచర్ ఖాళీలకు త్వరలోనే ప్రకటన అంటూ అనేకసార్లు చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. 8 ఏండ్లలో ఒకే ఒక్కసారి టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఏటా ఒకసారి టెట్ నిర్వహిస్తామని చెప్పి 8 సంవత్సరాల్లో 2 సార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టెట్, టీఆర్టీ నోటిఫికేషన్ పై శ్రద్ధ పెట్టాలి. ఖాళీగా ఉన్న వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. - రావుల రామ్మోహన్ రెడ్డి, వెల్దండ, జనగాం జిల్లా