భువనేశ్వర్: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము పూర్వీకుల ఊరికి కరెంట్ వచ్చింది. ముర్ము పేరును ప్రకటించగానే.. జాతీయ మీడియా మొత్తం ఆమె పూర్వీకుల ఊరైన మయూర్భంజ్ జిల్లా ఉపర్బెడాలోని డుంగురిసాహికు వెళ్లగా ఎన్నో సమస్యలు వెలుగులోకొచ్చాయి. అప్పటి వరకు నిర్లక్ష్యంగా
వ్యవహరించిన ఒడిశా సర్కార్ వేగంగా స్పందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఎంత విన్నవించుకున్నా.. ఆ గ్రామానికి కరెంట్ రాలేదు. ద్రౌపదీ ముర్ము, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అని ప్రకటించగానే.. ఆ గ్రామానికి టాటా పవర్ నార్త్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(టీపీఎన్ఓడీఎల్) వర్కర్లు చేరుకున్నారు. 38 పోల్స్, 900 మీటర్ల కేబుల్, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లతో పాటు కావాల్సిన మిషనరీతో వాలిపోయారు. అయితే ముర్ము ప్రస్తుతం అక్కడ నివాసం ఉండటం లేదు. ఉపర్బెడాలోని డుంగురిసాహికి 20 కిలోమీటర్ల దూరంలోని రాయిరంగ్పూర్కు షిఫ్ట్ అయ్యారు. కుసుమి బ్లాక్లోని ఉపర్బెడా గ్రామంలో బాదసాహి, డుంగురిసాహి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. 20 కుటుంబాలు ఉన్న బాదసాహిలో కరెంట్ ఉండగా.. డుంగురిసాహి వాసులు మాత్రం కిరోసిన్ దీపాలతో బతికారు. ఫోన్లు చార్జింగ్ చేసుకోవాలంటే.. డుంగురిసాహి వాసులు పక్కనే ఉన్న బాదసాహికి వెళ్తుంటారు.