- నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత
- హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా
- వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్
- రాయ్బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట
రాయ్బరేలీ/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఇక అమేథీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాయ్బరేలీ, అమేథీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారన్న సస్పెన్స్కు తెరపడింది.
శుక్రవారమే నామినేషన్లు ఫైల్ చేసేందుకు ఆఖరి రోజు కావడంతో డెడ్లైన్కు గంట ముందు సంబంధిత పత్రాలను ఎన్నికల అధికారిణి హర్షిత మాథూర్కు రాహుల్ గాంధీ అందజేశారు. ఆయన వెంట మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. దీనికి ముందు శుక్రవారం పొద్దున రాయ్బరేలీ ఎంపీ స్థానానికి రాహుల్ పేరును ఖరారు చేయగానే.. ఢిల్లీ నుంచి అందరూ నేరుగా అమేథీలోని ఫుర్సత్గంజ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా రాయ్బరేలీ కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
బీజేపీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్
2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలిచారు. ఈసారి మాత్రం రాయ్బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ తరఫున ఈ స్థానం నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్, బీఎస్పీ నుంచి ఠాకూర్ ప్రసాద్ యాదవ్ పోటీలో ఉన్నారు. రాయ్బరేలీ.. కాంగ్రెస్కు కంచుకోట. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, అమ్మమ్మ ఇందిరా గాంధీ, తాతయ్య ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.
భాగ్ రాహుల్.. భాగ్.. అంటూ బీజేపీ సెటైర్లు
రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంతో ‘భాగ్ రాహుల్.. భాగ్..’అంటూ బీజేపీ లీడర్లు సెటైర్లు వేశారు. అమేథీ నుంచి రాయ్బరేలీకి షిఫ్ట్ కావడంతో కాంగ్రెస్ ఓటమి ఖరారైనట్టే అని బీజేపీ జనరల్ సెక్రటరీ దుశ్యంత్ కుమార్ గౌతమ్ విమర్శించారు. అమేథీలో ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకున్నట్టేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అందుకే రాహుల్ అమేథీ నుంచి రాయ్బరేలీకి దూకాడని విమర్శించారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఖర్గేతో కలిసి రేవంత్ రెడ్డి హాజరు
రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాహుల్ నామినేషన్ ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యేందుకు ఖర్గే ప్రత్యేక విమానంలో రాయ్బరేలీ బయలుదేరారు. మార్గమధ్యలో బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఆగారు. దీంతో రేవంత్ రెడ్డి ఖర్గేతో కలిసి ఇదే విమానంలో వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేట్ కు చేరుకున్నారు.